అమాత్యులకు అపూర్వ స్వాగతం 

20 Jun, 2019 06:53 IST|Sakshi

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా కర్నూలులో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి..స్వాగతం పలికారు. 

సాక్షి, కర్నూలు :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, వారి శ్రమ, కృషితోనే అధికారంలోకి వచ్చామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.  ప్రభుత్వం, పార్టీలో కార్యకర్తలకే మొదటి ప్రాధానత్య అని, వారి సమస్యలు ఏమైనా ఉంటే తమదృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమస్యలపై కూడా అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు.

ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం చోటు దక్కించుకున్నారు.   మంత్రి పదవి హోదాలో వారు తొలిసారిగా బుధవారం హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు చేరుకోవడంతో   నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉదయాన్నే పుల్లూరు టోల్‌ప్లాజా వద్దకు డోన్, ఆలూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు వేలాదిగా చేరుకుని వారి రాక కోసం ఎదురుచూశారు. మంత్రులు అక్కడికి చేరుకోగానే  బొకేలు, పూలదండలు వేసి స్వాగతం పలికారు. అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి భారీ సంఖ్యలో కారులతో ర్యాలీగా చేరుకున్నారు.  

మరిన్ని వార్తలు