కూలీ అనుమానాస్పద మృతి

17 Apr, 2018 09:56 IST|Sakshi
పవర్‌గ్రిడ్‌ సంస్థకు ఆనుకుని పడివున్న కనకయ్య మృతదేహం

పలాస పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆవరణలో ఘటన

కాశీబుగ్గ : రామకృష్ణాపురం గ్రామం సమీపంలో ఉన్న పలాస పవర్‌గ్రిడ్‌ సంస్థలో గత కొన్ని నెలలుగా పనిచేస్తున్న కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పవర్‌ గ్రిడ్‌ సంస్థ ప్రహరీ పక్క ఉన్న మృతదేహం చూసిన స్థానికులు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇచ్ఛాపురం మండలంలో కేదారిపురం గ్రామానికి చెందిన నీలాపు కనకయ్య(46)గా గుర్తించారు. విషయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

కనకయ్య మృతదేహాన్ని పరిశీలిస్తే ముక్కు నుంచి రక్తం వస్తుండడంతో హత్య, ఆత్మహత్య, లేక విద్యుత్‌ ప్రమాదమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఘటనపై స్థానికంగా వేరేలా ప్రచారం జరుగుతోంది. ప్రమాదకరమైన పవర్‌గ్రిడ్‌ సంస్థలో పనిచేస్తున్న కూలీలు మృతి చెందితే రహస్యంగా మృతదేహాలను బయటకు పారవేస్తున్నారని, అందుచేతన స్థానికులను కాకుండా దూర ప్రాంత కూలీలను పనిలో పెట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన అనేక మంది కూలీలు అదృశ్యమైనట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. 

ఇంటి సందులోనే...

శ్రీకాకుళం సిటీ : నగరంలోని దండివీధిలో నివాసం ఉంటున్న గొర్ల చంద్రశేఖర్‌(45) సోమవారం వేకువజామున అనుమానాస్పద స్థితిలో ఇంటిసందులో మృతిచెందాడు. ఇతడు స్వచ్ఛభారత్‌ ప్రొగ్రాంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులతో సోమవారం రాత్రి వరకు ఇంట్లో గడిపిన చంద్రశేఖర్‌ తెల్లవారుజామున ఇంటిసందులో మృతిచెందడంపై కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చంద్రశేఖర్‌ తన ఇంటి సందులో పడి ఉండటాన్ని మృతుడి కుటుంబసభ్యులు గమనించారు.  సమాచారం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు, ఒకటోపట్టణ సీఐ బి.ప్రసాదులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.   మృతి చెందిన చంద్రశేఖర్‌  

మరిన్ని వార్తలు