సాక్షి, విశాఖపట్నం : నవతరాన్ని రాజకీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రెసిడెంట్ లీడర్షిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా లాలం జోగినాయుడును నియమించారు. విశాఖ జిల్లాలోని మారుమూల గ్రామంలో, వెనుకబడిన సామాజికవర్గంలో జన్మించిన జోగినాయుడు... ఉన్నత విద్యలో విదేశాలలో సైతం రాణించారు. యూరప్లో స్థిరమైన జీవితం ఉన్నప్పటికీ పుట్టిన గడ్డ మీద ప్రేమతో ప్రజా సంక్షేమం కోసం ముందుకు వచ్చిన యువతకు జోగినాయుడు ఆదర్శంగా నిలుస్తారని పవన్ ప్రశంసించారు. కాగా ఆయన నియామకం పట్ల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రెసిడెంట్ లీడర్షిప్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. విదేశాలలో ఉన్న యువత సైతం తెలుగు గడ్డ కోసం ఏదైనా చేయాలని భావిస్తే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశానికి యువ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలలోనూ తాము యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు. విధానాల రూపకల్పనలోనూ, సామాజిక సమస్యల పరిష్కారంలోనూ యువత భాగస్వామ్యం పెంచే ప్రయత్నం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో మరింత మంది యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.