విశాఖ మన్యంలో టీడీపీ అడ్రస్ గల్లంతు

18 Jul, 2020 19:12 IST|Sakshi

ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా  వైఎస్సార్‌సీపీలోకి వలసలు

అధినేత తప్పిదం.. తెలుగు తమ్ముళ్లకు మన్యంలో శాపం

తప్పు ఒకరిది.. శిక్ష మరొకరిది... ఇప్పుడు విశాఖ మన్యంలో తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్న మాట. ఎన్టీ రామారావు కాలంలో టీడీపీకి కంచుకోట లాంటి విశాఖ మన్యంలో ఇప్పుడు వెతికినా టీడీపీ అడ్రస్ కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఇప్పుడే అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకు శిక్ష గా తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు.

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో పాడేరు అరకు రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలంలో మంచి కంచుకోటగా కొనసాగేది. సినీ నటుడిగా ఎన్టీరామారావు అభిమానించిన గిరిజనులు ఆయనకు పట్టం కట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నిత్యం గిరిజన ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నించారు. దీంతో మంచి నాయకురాలిగా కొనసాగిన మత్సరాశ మణికుమారీ లాంటి నాయకులు కూడా తిరిగి గెలవలేకపోయారు. ముఖ్య విశాఖ మన్యంలోని బాక్సైట్ తవ్వకాలకు...గిరిజనుల సానుభూతి ఓట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆశించింది. అవన్నీ గమనించిన జనం  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ను గెలిపించగా ఆమెను కూడా తమ వైపు లాగి అక్రమాల కొనసాగించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమె కూడా రాజకీయ పతనమైంది. (కేసుల నుంచి రక్షణ కోసమే రాష్ట్రపతి వద్దకు..) 

ఆ తర్వాత అరకు ఎమ్మెల్యే గా కిడారి సర్వేశ్వరరావు పాడేరు ఎమ్మెల్యే గా గిడ్డి ఈశ్వరి గెలుపొందగా,  వారిద్దరినీ కూడా టీడీపీ వైపు లాగి బాక్సైట్ తవ్వకాలు జరిపాలని అనుకున్నారు. కానీ జనం ఎదురు తిరగడంతో తోక ముడిచారు. ఆ తర్వాత టీడీపీ వారసులుగా ఎన్నికల బరిలో దిగిన నాయకుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు తమకు శాపంగా మారిందని తెలుగుదేశం నాయకులు మన్యంలో అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీలో ఉంటే ఇంకా మనుగడ లేదని నిర్ణయించుకున్న గిరిజనులు ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా అనంతగిరి మండలంలో చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కొన్ని కుటుంబాలు.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సమక్షంలో కొయ్యూరు ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఇదంతా చంద్రబాబు నాయుడు తప్పిదాలు ఒక ఎత్తయితే ఏడాదికాలంగా సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు టీడీపీ అడ్రస్‌ను గల్లంతు చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  


 

మరిన్ని వార్తలు