గొంతు నొక్కారు

24 Aug, 2014 01:33 IST|Sakshi
గొంతు నొక్కారు

విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీలో మైక్ కట్
 

హైదరాబాద్: అధికార పార్టీ శాసనసభలో ప్రతిపక్షంపై దూషణల పర్వం కొనసాగించింది. విపక్షం లేవనెత్తిన అసలు అంశాలను పక్కదారి పట్టిస్తూ శ్రుతిమించిన విమర్శలు, తీవ్రస్థాయిలో నిందారోపణలతో టీడీపీ ఎదురుదాడి సాగింది. అధికార పక్షం నుంచి వస్తున్న నిందారోపణలపై వివరణ కోరడానికీ ప్రతిపక్షానికి అవకాశం ల భించలేదు. ఆ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వాకౌట్ చేస్తామని చెప్పడానికీ అవకాశమివ్వని ఘటన శాసనసభ వేదికగా చోటుచేసుకుంది. శాంతిభద్రతల అం శంపై 344 నిబంధన కింద స్వల్పకాలిక చర్చకు సంబంధించి శనివారం కూడా శాసనసభలో గం దరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల ఫలి తాల అనంతరం తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తల హత్య జరిగి, ఆ కుటుంబాలకు న్యా యం చేయాలి కాబట్టి వాటిపై చర్చ జరగాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేసిన ప్రయత్నాలకు అధికార పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలారు.

ఎన్నికల ఫలితాల అనంతర హత్యా రాజకీయాల మీద చర్చ జరగకుండా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిల మీద వ్యక్తిగత దూషణలు, అస త్య ఆరోపణలు చేస్తూ చర్చను పక్కదారి పట్టిం చారు. అధికార పక్ష సభ్యులు తమ ప్రసంగాల్లో అన్‌పార్లమెంటరీ(అభ్యంతరకర) పదాలు, తీవ్రమైన దూషణలతో నింపేశారు. ఇదేమిటని గట్టి గా నిలదీస్తూ మాట్లాడుతున్న విపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి మాటలు వినిపించకుండా స్పీకర్ మైక్ కట్ చేశారు. ఆ దశలో తమ నిరసనను తెలి యజేసి సభ నుంచి వాకౌట్ చేస్తామని చెప్తున్నా జగన్ మాట్లాడటానికి స్పీకర్ అనుమతించలేదు. నిరసన తెలియజేయడానికి కూడా మైక్ ఇవ్వకపోవడంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.

శనివారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన త ర్వాత శాంతిభద్రతల మీద లఘు చర్చను కొనసాగించడానికి స్పీకర్ అనుమతించారు. శుక్రవా రం అర్ధాంతరంగా ప్రసంగం ఆపివేసిన టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవకాశం ఇచ్చారు. శుక్రవారం తాను పరుషపదజాలం వాడలేదని, అయినా ప్రతిపక్ష నేత తమను బఫూన్లంటూ ఎందుకు వ్యాఖ్యానించారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. విపక్ష నేత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. వైఎస్సార్ సీపీ సభ్యులు తమ స్థానాల్లో నిల బడి.. తమ నాయకుడిని నరరూప రాక్షసుడని అన్నారని, అందుకు ముందుగా క్షమాపణలు చెప్పాలని గట్టిగా అడిగారు. ఒక దశలో స్పీకర్ తో సంబంధం లేకుండా అధికార, విపక్ష సభ్యు లు వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులు.. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ సభను నినాదాలతో హోరెత్తించారు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో 10.20గంటలకు సభను వాయి దా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 11.15 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు.. విపక్ష నేత క్షమాపణ చెప్పాలనే డిమాండ్ నుంచి టీడీపీ సభ్యులు కాస్త వెనక్కితగ్గారు. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆవేశంలో నోరు జారడం, అనుకోకుండా పరుషమైన మాట దొర్లడం సహజమని చెప్పారు.

కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా అంటారన్నారు. ప్రతిపక్ష నేత భేషజాలకు పోవాల్సిన అవసరం లేదని, గతంలో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఉద్దండుడు కూడా పరుష పదాలు వాడినప్పుడు ఉపసంహరించుకున్నారని వ్యా ఖ్యానించారు. ‘‘సభా గౌరవానికి, హుందాతనానికి భంగం కలిగించే విధంగా ఇరుపక్షాలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తాం. ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే ఆ పనిచేయవచ్చు. అది సభా గౌరవాన్ని పెంచుతుంది. ఇక మీదట సంయమనం పాటించండి’’ అని స్పీకర్ సూచించారు. తర్వాత చర్చ కొనసాగించడానికి గోరంట్లకు అవకాశం ఇచ్చారు. ఆయన మళ్లీ తీవ్రస్థాయిలో నిందారోపణలు చేశారు. బాంబే మాఫియా ముఠాలతో మొదలుపెట్టి... గతంలో జరిగిన హత్యలు, వివిధ కేసులను ప్రస్తావించా రు. వై.ఎస్.రాజారెడ్డి హత్య కేసులో నిందితులను చంపడానికి అంటూ.. అన్‌పార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తూ ఆవేశంతో గోరంట్ల ప్రసంగిస్తున్న తీరు పట్ల జగన్ అభ్యంతరం తెలి పారు. ‘‘విచ్చలవిడిగా అసత్యాలు, ఆరోపణలు చేస్తున్నా, ఇష్టానుసారం మాట్లాడుతున్నా ఊరికే ఉంటారా?’’ అని స్పీకర్‌ను ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు అసెంబ్లీలో ఖూనీ చేస్తున్నారు.. టీడీపీ సభ్యులు ఏ స్థాయిలో దూషణలు చేసినా మీకు అభ్యంతరం లేదా?’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. ‘‘ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తే స్పీకర్ స్థానానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు.

అది సరైనది కాదు. వారికి (టీడీపీ) అవకాశం ఇచ్చినప్పు డు వారు మాట్లాడుతున్నారు. మీకూ అవకాశం ఇస్తా మాట్లాడండి. ఎవరైనా అన్‌పార్లమెంటరీ భాష వాడితే రికార్డుల నుంచి తొలగిస్తాం’’ అం టూ ప్రతిపక్ష నేత మైక్‌ను కట్ చేశారు. మంత్రి యనమల జోక్యం చేసుకొని.. స్పీకర్ మీద ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం (మైక్) ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినా స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. ‘‘మీ నాయకుడికి మైక్ ఇస్తే స్పీకర్ స్థానం మీదే ఆరోపణలు చేశారు. నేను పూర్తిగా నిష్పాక్షికంగా ఉన్నాను’’ అని కోడెల పేర్కొన్నారు. సభ్యులు ఏది మాట్లాడినా అనుమతిస్తే.. ఇక నిబంధనలు ఎందుకని విపక్ష సభ్యులు నిలదీశారు. విపక్ష నేతకు మైక్ ఇవ్వాలనే డిమాండ్‌ను వైఎస్సార్ సీపీ సభ్యులు గట్టిగా వినిపించడంతో.. ‘‘మీరు స్పీకర్‌ను శాసించలేరు’’ అని సభాపతి పేర్కొన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా విపక్షం గొంతు నొక్కుతున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి వైఎస్సార్ సీపీ సభ్యులు నిష్ర్కమించారు.
 

>
మరిన్ని వార్తలు