కౌలు రైతు ఆత్మహత్య

13 Oct, 2015 19:37 IST|Sakshi

అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కారంచేడు మండలం కేశవరప్పాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చిరుమాల ఏలియా (45) నాలుగేళ్లుగా ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు, పత్తి సాగు చేస్తున్నాడు.

మూడేళ్ల నుంచి వ్యవసాయం కోసం చేసిన అప్పు రూ.3 లక్షలకు తోడు వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయి. అప్పులు తీరే మార్గం తెలియక శనివారం ఇంటి నుంచి పొలానికి వెళ్లిన ఏలియా అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏలియా ఇంటికి రాకపోవడంతో ఎక్కడికెళ్లాడో తెలియక కుటుంబ సభ్యులు వెతకగా.. మంగళవారం గ్రామానికి చెందిన పగడాల చెంచుపున్నయ్య పత్తి చెట్ల మధ్యలో పడి ఉన్న ఏలియా మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే సమాచారం కుటుంబసభ్యులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

 

మరిన్ని వార్తలు