మహిళను కాపాడిన లెక్చరర్‌

2 Jun, 2018 13:28 IST|Sakshi
మహేష్‌

కావలిరూరల్‌: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మహిళను ప్రాణాలకు తెగించి ఓ అధ్యాపకుడు కాపాడారు.  పట్టణంలోని జనతాపేటకు చెందిన మాదవరపు మహేష్‌ కో ఆపరేటీవ్‌ కళాశాలలోని తన గురువు విశ్రాంత ప్రిన్సిపల్‌ రత్నజోసెఫ్‌ ఇంటికి వచారు. ఆ సమయంలో రత్నజోసెఫ్‌ ఇంటి ఎదురుగా మిద్దెపైన ఉన్న మందా వెంకటేశ్వరరావు ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. వీధిలోని వారంతా అక్కడ గుమికూడి చూడగా వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు చెలరేగాయి. వెంకటేశ్వరరావు భార్య అన్నపూర్ణ మంటలను దాటుకొని బయటకు రాలేక భయంతో కేకలు వేస్తూంది. అక్కడికి చేరుకున్న వారు అగ్నిమాపకశాఖ వారికి సమాచారమందించి చూస్తూ నిలబడిపోయారు.

అయితే ప్రమాదాన్ని గ్రహించిన మహేష్‌ వెంటనే మిద్దె మీదకు వెళ్లి తలుపులు నెట్టివేసి లోనికి వెళ్లాడు. అయితే మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఫ్రిజ్‌కు అంటుకుంటున్నాయి. అత్యంత వేగంగా అన్నపూర్ణను చాకచక్యంగా పక్కకు తప్పించి గ్యాస్‌ సిలిండర్‌ను నెట్టేయడంతో అది పక్కకు పడిపోయింది. బెడ్‌షీటును తడిపి గ్యాస్‌ సిలిండర్‌పై వేయడంతో మంటలు ఆరిపోయాయి. గ్యాస్‌ సిలిండర్‌ రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేసి సిలిండర్‌ కిందకి తీసుకువెళ్లాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్యాస్‌ సిలిండర్‌ను పరిశీలించి పూర్తిగా ప్రమాదం తప్పిందని నిర్ధారించారు. మహేష్‌ ప్రాణాలకు తెగించి ఈ సాహసం చేసి అన్నపూర్ణను కాపాడటతో పలువురు అభినందించారు.  

మరిన్ని వార్తలు