ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల అడవుల్లో నాలుగు రోజుల క్రితం ఒక చిరుత హతమైంది. దీనిపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు గాలింపు చేపట్టగా సిద్దపల్లి గ్రామ సమీపంలోని పొలంలో 14 చిరుత గోర్లు లభించాయి. ఇందుకు సంబంధించి పొలం యజమాని జిలకర దాసును అదుపులోకి తీసుకున్నారు.
అయితే, పొలాన్ని మరో వ్యక్తికి లీజుకు ఇచ్చానని, తనకు చిరుత వధతో సంబంధం లేదని దాసు మొత్తుకున్నాడు. అతనికి మద్దతుగా అటవీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కూడా జరిగింది. దీంతో అధికారులు దాసును విడిచిపెట్టారు. అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, చిరుతను చంపిన ఘటనపై అటవీ అధికారులు పెదవి విప్పడం లేదు.