ఊరూ..వాడా ‘విమోచనం’

18 Sep, 2013 01:02 IST|Sakshi

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ విమోచన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో జిల్లాలోని పట్టణాలు, పల్లెలు మంగళవారం సందడిగా మారాయి. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో ప్రజలతోపాటు రాజకీయపార్టీల నాయకులు తెలంగాణ విమోచన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విమోచన వేడుకల్లో అన్ని రాజకీయ పార్టీలతోపాటు తెలంగాణ జేఏసీ, ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌వీ నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. గజ్వేల్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలపై టీజేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు జాతీయ జెండాలను ఎగురవేశారు. మిర్‌దొడ్డిలో టీఆర్‌ఎస్ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపై జెండా ఎగురవేయగా పోలీసులు వారి అరెస్టు చేశారు. ఏబీవీపీ నాయకులు జాతీయజెండా ఎగురవేయటంతోపాటు పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. పోతిరెడ్డిపల్లిలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి జాతీయజెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మనోజ్‌రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
 
 జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో....
 జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు. సంగారెడ్డిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో జేఏసీ, టీఆర్‌ఎస్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జాతీయజెండా ఎగురవేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ, వేణుగోపాల్‌స్వామి, సాబేర్, రాజేందర్‌నాయక్ పాల్గొన్నారు. దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి జాతీయజెండా ఎగురవేశారు. జోగిపేటలో జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హనుమాన్‌చౌరస్తా వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కిష్టయ్య, ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షులు మాణయ్య పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి జాతీయజెండా ఎగురవేశారు. గజ్వేల్‌లో జేఏసీ నాయకులు నర్సింగ్‌రావు, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ జాతీయజెండా ఆవిష్కరించారు. నర్సాపూర్‌లో జేఏసీ నేతలు అంజిరెడ్డి, జేఏసీ నాయకులు మాణయ్య, మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.
 
 వేడుకల్లో పాల్గొన్న మంత్రి సునీతారెడ్డి
 తెలంగాణ విమోచన వేడుకల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు పలుచోట్ల ఆపార్టీ నాయకులు జాతీయ, పార్టీ జెండాలను ఎగురవేశారు. కొల్చారంలో మంత్రి సునీతారెడ్డి జాతీయజెండా ఎగురవేయగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, నందీశ్వర్‌గౌడ్, నర్సారెడ్డిలు తమ నియోజకవర్గాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలు ఎగురవేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మెదక్‌లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు జెండా ఎగురవేయగా జహీరాబాద్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ మహంకాలి సుభాష్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు.
 
 బీజే పీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో...
 బీజేపీ నాయకులు సంగారెడ్డిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విమోచన దినాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం వారంతా పోలీసు పరేడ్ గ్రౌండ్‌వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో జడ్పీ కార్యాలయంపై బీజేపీ నాయకులు జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు అనురాధారెడ్డి, తాళ్లకల్పన, విజయలక్ష్మి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర నాయకులు ప్రకాశ్‌రావు, జిల్లా కార్యదర్శి దయానంద్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో సిద్దిపేటకు చెందిన తెలంగాణ పోరాట యోధులు జంగారెడ్డి, ఎం.ఎ.రహీంలను సన్మానించారు. సీపీఎం నాయకులు కేవల్‌కిషన్ భవన్‌లో సభను నిర్వహించారు. కర్నాటకలోని బీదర్‌లో తెలంగాణ విమోచన వేడుకలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
 

మరిన్ని వార్తలు