పిడుగుపాటుకు మహిళ మృతి

16 Aug, 2019 19:10 IST|Sakshi

సాక్షి, విజయనగరం : పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందడంతో పాటు మరో ఏడుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన 8మంది మహిళలు సమీప గ్రామం సన్యాసయ్య పాలెంలో కూలీ పనులకు వెళ్లారు. వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం రావడంతో ఇళ్లకు బయలుదేరారు. దారి మధ్యలో ఈదురు గాలులు ఎక్కువ కావడంతో చెట్టు దగ్గర తలదాచుకున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో అంకమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ఏడుగురు మహిళలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తక్షణమే 108కి సమాచారం అందించి గాయపడిన వారిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

మరిన్ని వార్తలు