ఓటర్‌ ఐడీకి మొబైల్‌ నంబర్‌కు లింక్‌ 

7 Mar, 2019 04:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఓట్ల తొలగింపు సమస్యకు ఎన్నికల సంఘం పరిష్కారం

సాక్షి, అమరావతి: ఓటరుతో ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు... ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్న, ఓటర్లను గందరగోళపరుస్తున్న అంశం ఇది. ఈ సమస్యకు ఎన్నికల సంఘం ఓ పరిష్కార మార్గం చూపిస్తోంది. మీ ఓటరు ఐడీని మీ మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడం ద్వారా.. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్‌ నంబర్‌ను ఒకసారి లింక్‌ చేస్తే మీ పేరిట ఫామ్‌–7తో సహా ఏమైనా మార్పులు చేర్పులకు దరఖాస్తులు వస్తే వెంటనే మీ మొబైల్‌కు హెచ్చరిక (అలర్ట్‌) సందేశం వస్తుంది.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా http://ceoaperms.ap.gov.in/AP&MobileNoRegistration/MobileNoRegistration.aspx అనే లింక్‌లోకి వెళ్లి మీ ఎలక్టొరల్‌ ఫోటో ఐడీ కార్డు నంబర్‌ (ఎపిక్‌ నంబర్‌)ను, ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే ఆ నంబర్‌కు వన్‌టైమ్‌ పాస్‌ వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలు ఎపిక్‌ నంబర్‌తో మీ ఫోను అనుసంధానం అయినట్లే. మీ కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే నంబర్‌కు ఇలా లింక్‌ చేసుకోవచ్చు. ఇది కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు