రైలై ళ్లిపోతుంది.. కదలండహో!

30 Nov, 2014 03:21 IST|Sakshi
రైలై ళ్లిపోతుంది.. కదలండహో!

ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌కు డిసెంబర్ నుంచే కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలోని రైల్వే డిమాండ్ల కోసం ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులకు రైల్వే శాఖ లేఖలు రాసింది. ఏటా తీరా బడ్జెట్ ప్రకటించిన తర్వాత జిల్లాకు న్యాయం చేయలేదని ప్రకటనలు ఇవ్వడం మినహా, ముందు నుంచే జాగ్రత్తపడి డిమాండ్లను సాధించుకోవడంలో ప్రజాప్రతినిధులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్‌లోనైనా కేటాయింపులు ఆశాజనకంగా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టాలి. లేదంటే మనకు మళ్లీ మొండి చేయి తప్పదు.
 
సాక్షిప్రతినిధి, అనంతపురం:  ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌కు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలెట్టింది. మీ ప్రాంతంలో రైల్వే డిమాండ్ల వివరాలు ఇవ్వాలంటూ జిల్లాలోని ఇద్దరు ఎంపీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు దక్షిణమద్య రైల్వే అధికారులు లేఖలు రాశారు. బడ్జెట్ కేటాయింపుల్లో   జిల్లాకు ఏటా అన్యాయమే జరుగుతోంది.

అధిక ఆదాయం తెస్తున్న డివిజన్‌లలో గుంతకల్లు డివిజన్ ఒకటి. ఈ డివిజన్‌లో అనంతపురం జిల్లా కీలకమైనది. అయితే ఆదాయం మేరకు కేటాయింపులు ఉండటం లేదు. కొత్త రైళ్లు, మార్గాలు, సర్వేలు, ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. చాలా వరకూ ప్రతిపాదనల్లోనే ఉండిపోవడం మినహా పనులు పట్టా లెక్కడం లేదు.

అభివృద్ధి పనుల ఊసే లేదు
అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి గతంలో రైల్వే శాఖకు విన్నవించారు. ఇప్పటి వరకూ అది ఆచరణకు నోచుకోలేదు. గుంతకల్లు, ధర్మవరం గేట్ రోడ్డు, బళ్లారిగేట్ రోడ్డు, కసాపురం రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిస్తున్నా ఉపయోగం లేదు.

నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం లో 126 కి.మీలకు 843.45 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎర్రగుంట్ల-నొస్సం వరకు రైలుమార్గం పూర్తయింది. ఈ మార్గ నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.753.44 కోట్లు ఖర్చు చేశారు. 2012-13 బడ్జెట్‌లో నొస్సం వరకూ ప్యాసింజరు రైలు నడుపుతామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు.

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని మునీరాబాద్-మహబూబ్‌నగర్ (వయా రాయచూర్ మీదుగా) కొత్త రైలు మార్గానికి 1290 కోట్ల రూపాయల వ్యయంతో అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు ఈ రైలు మార్గంలో రూ. 244 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. 2014-15 రైల్వేబడ్జెట్‌లో ఈ రైలు మార్గానికి రూ.120 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ బడ్జెట్‌లోనైనా భారీగా నిధులు విడుదల చే స్తే పనులు త్వరితగతిన పూర్తవుతాయి.

కడప-బెంగుళూరు మధ్య రైలు మార్గంలో రూ.1343.46 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఇప్పటి దాకా రూ.185 కోట్లు కేటారుుంచారు. గత బడ్జెట్‌లో 30 కోట్లు విడుదలయ్యాయి. ఈ బడ్జెట్‌లోనైనా భారీగా నిధులు విడుదల చేసేందుకు ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.

రాయచూర్-గుంతకల్లు మధ్య 81.1 కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు రూ.345 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటిదాక రూ.7.39 కోట్లు మాత్రమే విడుతల చేశారు. రూ. 55.14 కోట్లు మాత్రమే విడుదల చేశారు.

2012-13, 2013-14 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కేటాయించకపోవడంతో రైల్వే శాఖ కూడా నిధులు కేటాయించలేదు. 2014-15 బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కేటాయించే అవకాశమే లేదని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చిక్‌బళాపూర్-పుట్టపర్తి, పుట్టపర్తి-కదిరి రైల్వే మార్గాలదీ అదే పరిస్థితి.

పుట్టపర్తి-కదిరి, పుట్టపర్తి-చిక్‌బళాపూర్ రైలు మార్గాల నిర్మాణం కోసం రైల్వే బోర్డు సర్వే చేయించింది. అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో అంచనాల్లోనే ఆ ప్రాజెక్టులను రైల్వేశాఖ పక్కన పెట్టేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించతలపెట్టిన రాయదుర్గం-తుమకూరు రైలు మార్గానికి 2011లో శంకుస్థాపన చేసిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2014కు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 2012-13, 13-14 బడ్జెట్‌లో ఒక్క పైసా నిధులు కేటాయించలేదు. ఆపై కూడా మొక్కుబడిగా చిల్లర విదిల్చారు. ఈ బడ్జెట్‌లో ఆశాజనకంగా నిధులు కేటాయించేలా ఎంపీలు ఒత్తిడి తేవాలి.

పుట్టపర్తి-కదిరి, పుట్టపర్తి-చిక్‌బళాపూర్ రైలు మార్గాల నిర్మాణం కోసం రైల్వే బోర్డు సర్వే చేయించింది. అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో అంచనాల్లోనే ఆ ప్రాజెక్టులను రైల్వేశాఖ పక్కన పెట్టేసింది.

కేంద్రంలో కొలువుదీరిని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, ఎంపీ నిమ్మలకిష్టప్ప జిల్లాకు అవసరమైన రైల్వే ప్రాజెక్టులను సాధించుకోవడంలో ఏమేరకు ప్రయత్నిస్తారో, రప్పిస్తారో వేచిచూడాలి.
 
 పాజెక్టు పేరు                          అవసరమైననిధులు        విడుదలైన నిధులు
 గుంతకల్లు విద్యుత్తు లోకోషెడ్డు        రూ.140 కోట్లు            రూ. 12.37 కోట్లు
 (వంద విద్యుత్ లోకోఇంజన్ల సామర్ధ్యం)
  పామిడి పెన్నానదిపై వంతెన            రూ.25 కోట్లు            రూ.19.00 కోట్లు
 గుంతకల్లు మోడల్ స్టేషన్ బిల్డింగ్        రూ.6 కోట్లు            రూ.3 కోట్లు

మరిన్ని వార్తలు