లాక్‌డౌన్‌: ఏపీ ప్రభుత్వం ఈ-పాస్‌ల జారీ

30 Mar, 2020 12:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల తయారీ, రవాణా సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ (ఎమర్జెన్సీ) పాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిత్యావసర వస్తువుల కంపెనీలు, సరఫరాదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ-పాస్‌లు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్‌ లేదా ఫోన్‌కు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వం పాసులు జారీ చేయనుంది. నిత్యావసర వస్తువుల తయారీ, రవాణాకు చెందిన కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉధ్యోగులకు లేదా కనీసం ఐదుగురికి నిబంధనలకు లోబడి పాస్‌లు ఇవ్వనున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పాస్‌లు జారీ చేస్తారు.
(చదవండి: లాక్‌డౌన్‌: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?)

కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు (ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు) అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌ రూపంలో ఉండే ఈ-పాస్‌లను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల వద్ద తగిన మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పాస్‌లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్‌ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది. నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్‌ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది.
(చదవండి: ఇల్లు సైతం ‘లాక్‌’ డౌన్‌)

క్రింది లింక్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌ అప్లై:
https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration
(లేదా)
https://www.spandana.ap.gov.in/

మరిన్ని వార్తలు