ఈ ఫొటోనే సాక్ష్యం

7 May, 2015 01:53 IST|Sakshi
ఈ ఫొటోనే సాక్ష్యం

అభీష్ట, కార్తికేయలతో లోకేష్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ వెంట ఇద్దరు అధికారులను అమెరికా పంపించిన విషయం బయటకు పొక్కకుండా ఎంతగా జాగ్రత్త పడినా సాధ్యం కాలేదు. ముఖ్యమంత్రి ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాలను కేవలం లోకేష్‌కు తోడుగా అమెరికా పంపించారన్న విషయం బయటపడింది. లోకేష్ ఈ నెల 3 నుంచి 12 వరకు అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్‌కు తోడుగా చంద్రబాబు తన ఓఎస్డీ అభీష్ట, కార్తికేయ మిశ్రాలను ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేకంగా అమెరికా పంపించారు.

అయితే ఎవరికీ అనుమానం రాకుండా అభీష్ట కోసం ఒక జీవో (జీవో 1326), కార్తికేయ మిశ్రా కోసం మరో జీవో (నంబర్ 1336) జారీ చేశారు. ఇద్దరూ 3 వ తేదీ నుంచి 12 వరకు అమెరికాలో పర్యటిస్తారని, ఇద్దరికీ అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జీవోల్లో పేర్కొంది. లోకేష్ పర్యటనకు వీరిద్దరి పర్యటనకు సంబంధం లేదని చెప్పడానికి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారు ముగ్గురూ ఒకే విమానంలో అమెరికా బయలుదేరగా వెళ్లిన రోజు నుంచి అంతా కలిసే తిరుగుతున్నారు. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోలో వారు ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు మీడియాకు చిక్కాయి.
 

మరిన్ని వార్తలు