లారీ, బైక్ ఢీ : ఇద్దరి మృతి

11 Oct, 2013 03:53 IST|Sakshi
 తల్లాడ, న్యూస్‌లైన్ : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తల్లాడ మండలం రెడ్డిగూడెం క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన హరికట్ల ప్రశాంత్ (25), కొణిజర్లకు చెందిన ఆర్‌ఎంపీ కట్ల రంజిత్‌కుమార్(35), కాశిమళ్ల రాంబాబులు గురువారం తల్లాడ సమీపంలోని దళిత కాలనీలో ఉన్న బంధువుల ఇంట్లో కర్మకాండలకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. వారు తల్లాడ నుంచి కొణిజర్లకు తిరిగి వస్తుండగా రెడ్డిగూడెం సమీపంలో ఖమ్మం నుంచి తల్లాడ వైపు వస్తున్న కర్రలోడు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్, రంజిత్‌కుమార్‌లు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాశిమళ్ల రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108 వాహనంలో ఖమ్మం తరలించారు. తల్లాడ ట్రైనీ ఎస్సై రవీందర్, ఏఎస్సైలు కేశవరావు, పుల్లారావులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 
 బయలు దేరిన పదినిమిషాల్లోనే...
 తల్లాడలో సమీప బంధువు కర్మకాండలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న పది నిమిషాల్లో ఇద్దరు యువకులు మృతి చెందడంతో తల్లాడలోనూ, కొణిజర్లలోనూ విషాదచాయలు అలముకున్నాయి. తల్లాడ నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడం, ఇద్దరు మృతి చెందడంతో సంఘటన స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.  
 
మరిన్ని వార్తలు