పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

23 Sep, 2018 07:16 IST|Sakshi
ప్రేమ జంట తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సీఐ కేశవరావు

విశాఖ క్రైం/మల్కాపురం(విశాఖ పశ్చిమ): ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. జీవీఎంసీ 46వ వార్డు శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన బిందు మాధవి స్థానిక మల్కాపురం సెయింట్‌ ఆన్స్‌ మహిళ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. యువ తి ఇంటికి సమీపాన రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సతీష్‌కుమార్‌ నివాసముంటున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ నెల 20న అన్నవరంలో వివాహం చేసుకున్నారు.

అనంతరం శనివారం స్వస్థలానికి రాగా విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు ఇద్దరినీ వేరుచేయాలని   యత్నించారు. దీంతో ప్రేమజంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ నగర పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలోని లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ ఫకీరప్పను ఆశ్రయించి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఫకీరప్ప విషయాన్ని మల్కాపురం పోలీసులకు తెలియజేసి ప్రేమజంటను అక్కడకు పంపించారు. ఈ నేపథ్యంలో స్థానిక సీఐ కేశవరావు ఇరువురు తల్లిదండ్రులను పిలిపించి పోలీస్‌ స్టేషన్‌లో నచ్చజెప్పారు. వారిద్దరూ మేజర్‌లు అని, వారు ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారని, ఈ విషయంలో ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులను హెచ్చరించారు. అనంతరం వారిని అక్కడి నుంచి పంపించేశారు.

మరిన్ని వార్తలు