ప్రేమ పెళ్లితో.. పోలీసులకు తంటా!

12 Dec, 2013 04:18 IST|Sakshi

సాక్షి, తిరుమల: తమిళనాడులోని వాణియంబాడికి చెందిన ఓ ప్రేమ జంట బుధవారం తిరుమలలో పెళ్లి చేసుకుంది. అమ్మాయి మైనర్ అని, ప్రియుడు కిడ్నాప్ చేశాడంటూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో పారిపోయి వచ్చానని, తన ఇష్టపూర్వకంగానే ప్రియుడిని పెళ్లి చేసుకున్నానని ఆ యువతి తెలిపింది. దీంతో తిరుమల పోలీసులు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు. వివరాలిలా.. తమిళనాడులోని వేలూరు జిల్లా వాణియంబాడికి చెందిన ప్రభాకర్ (22), అదే ప్రాంతానికి చెంది బెంగళూరులో స్థిరపడిన లత బుధవారం తిరుమలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

ఈ సమాచారం తెలుసుకుని వధువు బంధువులు తిరుమలకు చేరుకున్నారు. నవ దంపతులను బస్టాండ్‌లో పట్టుకున్నారు. తాను ప్రియుడితోనే జీవిస్తానని లత తెగేసి చెప్పింది. ఇంతలో జనం గుమికూడారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నడిరోడ్డులో పంచాయితీ వద్దంటూ అందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మైనరుగా ఉన్న లత (17 సంవత్సరాలా 10 నెలలు)కు గతనెల 25వ తేదీన మరో యువకుడితో నిశ్చితార్థం చేశామని ఆమె బంధువులు పోలీసులకు తెలిపారు. లతను ప్రభాకర్ కిడ్నాప్ చేశాడని వాణియంబాడి స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

దీనిపై నవ వధువు లత అభ్యంతరం తెలిపింది. తనకు ఇష్టంలేని వ్యక్తితో నిశ్చితార్థం జరిపించా రంది. అందుకని పారిపోయి వచ్చి ప్రియుడిని  పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది. దీంతో తిరుమల పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని.. ఇరువర్గాలు వాణియంబాడి స్టేషన్‌లో తేల్చుకోవాలని చెప్పారు. అయితే తిరుమల పోలీసులు మాత్రం ముందుజాగ్రత్తగా ఇరువర్గాల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు