పెళ్లి చేసుకోమని అడిగితే..

26 Oct, 2016 11:39 IST|Sakshi
పెళ్లి చేసుకోమని అడిగితే..

రైలు కిందకి తోసేసిన ప్రియుడు.. కాళ్లు పొగొట్టుకున్న బాధితురాలు

 విజయనగరం ఫోర్ట్: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని రైలు కిందకి తోసేశాడో ప్రేమికుడు. ఫలితంగా ఆమె రెండు కాళ్లను పోగొట్టుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. తెర్లాం మండలం వెలగవలస గ్రామానికి చెందిన రాగోలు నీలవేణి(23) రంగపువలస గ్రామానికి చెందిన ధమరసింగి రామకృష్ణ(30) ఓ మ్యూజికల్ బ్యాండ్ పార్టీలో గాయకులుగా చేరారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆరేళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుంది.

తనని పెళ్లి చేసుకోమని నీలవేణి ఇటీవల రామకృష్ణను కోరగా, అతడు రూ.10 లక్షలు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై కొంతకాలంగా వీరి మధ్య వివాదం నడుస్తోంది. సోమవారం ఉదయం రామకృష్ణ చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఆమె అక్కడకు చేరుకుని పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. ఇందుకు అతడు తిరస్కరించడంతో చచ్చిపోతానని బెదిరించింది. వీరిరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో రామకృష్ణ ఆమెను రైలు వస్తున్న తరుణంలో పట్టాలపైకి తోసేశాడు. ఆమెకు తీవ్ర గాయాలవడంతో రైల్వే పోలీసులు ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె రెండు కాళ్లను తొలగించారు.  నిందితుడు రామకృష్ణ పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు