కొనసాగుతున్న అల్పపీడనం

27 Nov, 2014 01:23 IST|Sakshi

* కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం  కనిపిస్తున్న చలి ప్రభావం

విశాఖపట్నం, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో శ్రీ లంక, హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం తమిళనాడు కోస్తాపై ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షంగానీ, ఉరుములతో కూడిన జల్లులుగానీ పడవచ్చని వివరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే 1-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో చలి ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు ఏపీలోని నందిగామ, ఆరోగ్యవరాల్లో 15 డిగ్రీలు, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

మరిన్ని వార్తలు