లాక్‌డౌన్‌లోనూ ఉపాధికి భరోసా

8 Jun, 2020 03:47 IST|Sakshi

ఏపీ సహా ఎనిమిది రాష్ట్రాల్లో తక్కువగా నిరుద్యోగిత రేటు

సీఎంఐఈ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు అమాంతంగా పెరుగుతోంది. కానీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు మెరుగైన రీతిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ నిరుద్యోగిత రేటు కంటే ఆ రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు తక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మే చివరి వారంలో దేశంలో నిరుద్యోగ సమస్యపై సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవల నివేదిక విడుదల చేసింది. ప్రధానమైన 20 రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యపై విశ్లేషించింది. 59.20 శాతం నిరుద్యోగిత రేటుతో జార్ఖండ్‌ మొదటి స్థానంలో ఉండగా, 9.60 శాతం నిరుద్యోగిత రేటుతో ఒడిశా చివరి స్థానంలో ఉంది. సీఎంఐఈ నివేదికలోని ప్రధాన అంశాలు...

► దేశం మొత్తం మీద ఫిబ్రవరిలో నిరుద్యోగిత రేటు 7.40 శాతం ఉండగా, మే చివరి వారానికి 24.30 శాతానికి పెరిగింది.
► ఏపీ, ఒడిశా, రాజస్తాన్, మహారాష్ట్ర, అసోం, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగిత రేటు 20% కంటే తక్కువగా ఉంది. 
► హరియాణ, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు 20 శాతం నుంచి 40 శాతం మధ్యలో ఉంది.
► లాక్‌డౌన్‌ వల్ల జార్ఖండ్, బిహార్, ఢిల్లీలలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ప్రబలింది. జార్ఖండ్‌లో 59.20 శాతం, బిహార్‌లో 46.2 శాతం, ఢిల్లీలో 44.90 శాతం నిరుద్యోగిత రేటు నమోదు అయ్యింది.
► ఏపీలో పేదలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించింది. ఉపాధి పనుల కల్పనలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు