వంట గ్యాస్ సబ్సిడీకి మళ్లీ నగదు బదిలీ

15 Nov, 2014 02:04 IST|Sakshi
వంట గ్యాస్ సబ్సిడీకి మళ్లీ నగదు బదిలీ

వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి  సవరించిన నగదు బదిలీ పథకాన్ని  చిత్తూరు జిల్లాలో అమలుచేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగ దారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ ఇందుకు గడువు విధించారు. వినియోగదారులు ఆధార్‌తో పాటు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ప్రక్రియను గడువులోపల పూర్తిచేసుకోవాలి. అలా చేయకపోతే వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందదు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు.
 
చిత్తూరు : జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 32 ఏజెన్సీలుండగా 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులున్నారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇక భారత్ గ్యాస్‌కు సంబంధించి 19 ఏజెన్సీలుండగా, 96,100 మంది వినియోగదారులు ఉన్నారు.

ఇప్పటివరకు ఆధార్ సీడింగ్ జరగనవి ఇండేన్‌కు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వద్ద 3,59,475 (89శాతం) మంది వినియోగదారులు ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోగా, బ్యాంకుల్లో మాత్రం 3,25,446 (80.57 శాతం) మందే అకౌంట్లు పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 2,48,023 మంది (92.07శాతం) ఏజెన్సీ వద్ద ఆధార్‌సీడింగ్ పూర్తిచేసుకోగా, బ్యాంకుల్లో 1,84,791 (83.62శాతం) మాత్రమే అకౌంట్లు పూర్తి చేశారు. భారత్ గ్యాస్‌కు సంబంధించి 89,948 (93.65శాతం) మంది ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా, 77,303 (80.37శాతం) మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేశారు. మూ డు ఏజెన్సీల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 71 ఏజెన్సీల పరి ధిలో 7,20,991 మంది వంట గ్యాస్ వినియోగదారులుం డగా వీరిలో 6,54,246 మంది గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధా ర్ సీడింగ్ పూర్తిచేసుకోగా ఇక 5,87,540 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలను పూర్తి చేశారు.  ఈ లెక్కన గ్యాస్ ఏజెన్సీలవద్ద సరాసరి 90.85 శాతం మంది వినియోగాదారులు ఆధార్ సీడింగ్ పూర్తిచేసుకోగా, 82.01 శాతం మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తి చేశారు. మిగిలిన వారు ఆధార్ సీడింగ్ పూర్తిచేయలేదు.

సీడింగ్ పూర్తై వారికే సబ్సిడీ

వంటగ్యాస్ వినియోగానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధార్ సీడింగ్‌తోపాటు బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేసిన వారికే ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తుంది. ఏ ఒక్కటి చేయకపోయినా  వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ వర్తించదు.  ప్రక్రియ పూర్తిచేయని వారు గ్యాస్ మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది.

ప్రక్రియ పూర్తి చేయడం ఎలా?

వినియోగదారులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సంబంధిత వంటగ్యాస్ ఏజెన్సీలో అందజేయాలి. ఆ తరువాత గ్యాస్ ఏజెన్సీ వారి వద్ద ఫారం -3 నమూనాను తీసుకుని, అందులో  తాము వినియోగిస్తున్న గ్యాస్‌కు సంబంధించిన 17 అంకెలతో కూడిన  కన్స్యూమర్ ఐడీ నెంబ ర్‌ను నింపాలి. దాంతోపాటు గ్యాస్ కేటాయింపునకు సంబంధించిన రశీదును జత చేసి బ్యాంకుకు సమర్పించాలి.
 ఈ ప్రక్రియకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అవసరం లేదు. ఆధార్ కార్డు లేనివారు  వారు  ఫారం -3 ద్వారా బ్యాంకులో అకౌంట్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉన్న వారు  కార్డు జిరాక్స్‌కాపీనీ బ్యాంకులో అందజేయవచ్చు. ఫారం-3 నమూనాలు సంబంధిత గ్యాస్ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో ఆధార్ మాత్రమే ఇచ్చి బ్యాంకు అకౌంట్లు చేయని వారు ఫారం -3 ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
 
అందరూ ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవాలి

ఆధార్ సీడింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 14వ తేదీలోపు వినియోగదారులు పూర్తి చేసుకోవాలి. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి ఫారం -3 ద్వారా ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. శనివారం నుంచే వినియోగదారులు గ్యాస్‌కు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి సబ్సిడీ మొత్తం బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది. సబ్సిడీ మొత్తం ఎంత అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.
  - ఎంవీ సత్యప్రసాద్, ఎల్‌పీజీ డెప్యూటీ సేల్స్ మేనేజర్
 
గ్యాస్ ధరలపై స్పష్టత రాలేదు

గ్యాస్ సిలెండర్ ధర తోపాటు సబ్సిడీ ఎంత అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రభుత్వం ఆధార్ సీడింగ్‌లో భాగంగా సిలెండర్‌కు పూర్తి ధర చెల్లించాల్సిందే. ఫిబ్రవరి 14 లోపల ఆధార్ సీడింగ్ చేయకపోతే సబ్సిడీ పొందే అవకాశం కోల్పోతారు. వినియోగదారులు జాగ్రత్తపడి బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేసుకోవాలి. ప్రభుత్వం వినియోగదారుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లతో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

 - కిషోర్‌కుమార్‌రెడ్డి
 ప్రధాన కార్యదర్శి,గ్యాస్ డీలర్స్ అసోషియేషన్
 

>
మరిన్ని వార్తలు