'టీ స్టాల్ ప్రారంభించి.. ఎన్నికల ప్రచారం'

29 Jan, 2014 15:23 IST|Sakshi
'టీ స్టాల్ ప్రారంభించి.. ఎన్నికల ప్రచారం'

విజయవాడ: బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు వినూత్నంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో బుధవారం టీ స్టాల్ ను ప్రారింభించి ఓ కప్పు తాగారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. తన జీవితంలో తొలిసారి టీ తాగానని చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకప్పుడు టీ బాయ్ గా జీవిత ప్రస్థానం ఆరంభించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు టీ స్టాల్ ఆరంభి వచ్చే లోక్ సభ ఎన్నికలకు ప్రచారం మొదలెట్టారు.

ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ మోడీపై విమర్శలు చేయడాన్ని వెంకయ్య తప్పుపట్టారు. మోడీ ఎప్పటికీ ప్రధాని కాలేరని, కావాలంటే కాంగ్రెస్ ప్లీనరీ వద్ద టీ అమ్ముకునేందుకు స్థలం కేటాయిస్తామని అయ్యర్ వ్యాఖ్యానించారు. అయ్యర్ వ్యాఖ్యలు వేలాది మంది టీ అమ్ముకునే వారిని అవమానించడమేనని వెంకయ్య విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు కుంభకోణాల్లో కూరుకుపోయారని అన్నారు. ప్రజలందరూ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు