అతి తీవ్ర తుఫాన్గా మారిన 'మాదీ'

8 Dec, 2013 20:14 IST|Sakshi

విశాఖ:నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఏర్పడిన మాదీ తుపాను అతి తీవ్ర తుఫాన్గా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మాదీ తుఫాను నెమ్మదిగా ఉత్తర దిశగా పయనిస్తుందని తెలిపింది. దీంతో అన్ని ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్యకారులు వేట వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను కేంద్రం తెలిపింది.

దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు వచ్చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ‘మాదీ’ గత తుపాన్ల కంటే భీకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఎలా ఉంటుందో మరో రెండు రోజులు వేచి చూస్తే గానీ చెప్పలేమంటున్నారు. నవంబర్ 28న తీరం దాటిన లెహర్ తుపాను ప్రభావం సన్నగిల్లింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో తుపాను రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు