మహారాష్ట్రలో కూడా దిశ చట్టం..!

20 Feb, 2020 18:41 IST|Sakshi

ఏపీ ప్రభుత్వాన్ని అభినందించిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌

సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులను ఆయన అభినందించారు. సచివాలయం సీఎస్‌ సమావేశం మందిరంలో గురువారం దిశ బిల్లుపై జరిగిన సమావేశంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ.. దిశ లాంటి బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ’దిశ’  బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించడం అభినందనీయమన్నారు. దిశ చట్టంపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. (దిశ.. కొత్త దశ)


దేశంలోనే మొదటిసారిగా..
దేశంలోనే మొదటిసారిగా చిన్నారులు,మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు ‘దిశ బిల్లు’ను తీసుకువచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దిశ బిల్లు అమలుకు ప్రభుత్వం రూ. 87 కోట్లు ఇప్పటికే కేటాయించిందని వెల్లడించారు. 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు.  ప్రత్యేక కంట్రోల్ రూం, వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని సుచరిత పేర్కొన్నారు.
(‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ )

చారిత్రాత్మకమైన బిల్లు..
బాలికలు, మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను చారిత్రాత్మకమైన బిల్లుగా మహిళా శిశు,సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అభివర్ణించారు. 2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి వనిత తెలిపారు.

కసరత్తు చేసిన తర్వాతే..
రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాతే ‘దిశ బిల్లు’ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. ఈ బిల్లు అమలులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ‘దిశ చట్టం’ అమలుకు ప్రత్యేకంగా ఇద్దరు మహిళా అధికారులను నియమించామని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు