సామాజిక బాధ్యతగా ఎంఈసీ

23 Dec, 2013 01:12 IST|Sakshi
సామాజిక బాధ్యతగా ఎంఈసీ

ప్రపంచస్థాయి బోధన, వసతులతో ‘మహీంద్ర’కళాశాల
పూర్తిగా పరిశ్రమలతో అనుసంధానం... విద్యార్థికి ఏటా ఇంటర్న్‌షిప్
‘సాక్షి’తో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్
 
సాక్షి, హైదరాబాద్: దేశ పారిశ్రామికరంగంపై తనదైన ముద్రవేసిన మహీంద్ర గ్రూప్ ఇప్పుడు సమాజానికి తనవంతు చేయూతగా విద్యారంగంలోకి అడుగుపెట్టిందని మహీంద్ర ఎకోల్ సెంట్రల్(ఎంఈసీ) బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్ పేర్కొన్నారు. ఎంఈసీ ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యకు భిన్నంగా నేచురల్ సెన్సైస్‌పై ప్రధానంగా దృష్టిపెడుతూ అంతర్జాతీయ బోధన ప్రమాణాలు, మౌలిక వసతులతో నిపుణులైన ఇంజనీర్లను తయారుచేయనున్నట్లు తెలిపారు. ఎంఈసీ ఏర్పాటు లక్ష్యాలపై ఆయన సాక్షితో మాట్లాడారు.
 
సాక్షి: రాష్ట్రంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్, ట్రిపుల్‌ఐటీలు, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఈసీ అవసరమేంటి?
 రాహుల్: సామాజిక బాధ్యతగా మహీంద్ర గ్రూప్ ఈ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత విద్యావిధానం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా లేదు. ఆ అవసరాలను తీర్చడానికి ప్రపంచస్థాయి విద్యాసంస్థను నెలకొల్పే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం.
 
 సాక్షి: ఎంఈసీ ఇతర విద్యాసంస్థలకు ఏవిధంగా భిన్నం?
 రాహుల్: ఐఐటీలు సహా ఇంజనీరింగ్  కాలేజీలన్నీ 40 ఏళ్ల నాటి కరికులమ్‌తో బోధిస్తున్నాయి. ఆ కరికులమ్ ఉత్పత్తిరంగానికి ఉద్దేశించినది. కానీ ఇప్పుడు ఉత్పత్తిరంగ వాటా కేవలం 18  శాతమే. అందుకే యూరప్ విద్యావిధానంలో 200 ఏళ్ల అనుభవమున్న ఎకోల్ సెంట్రల్, జేఎన్టీయూహెచ్‌లతో ఒప్పందం చేసుకుని ఐదేళ్ల ఎంటెక్ డిగ్రీ కోర్సు కోసం అంతర్జాతీయస్థాయి పారిశ్రామిక అవసరాలను తీర్చగలిగే కరికులం రూపొందించాం.
 
 సాక్షి: ప్రస్తుత కరికులంతో ఉపయోగం లేదా?
 రాహుల్: అది పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా లేదు. ఆత్మవిశ్వాసం, భాష, టీంవర్క్, ప్రాజెక్టు రూపకల్పన నైపుణ్యాలు లోపించాయి. మా ఐదేళ్ల కోర్సులో ఫ్రెంచ్ భాష కూడా నే ర్పిస్తాం. తొలి రెండున్నరేళ్లు నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్ బోధిస్తాం. ఆ తర్వాతే స్పెషలైజేషన్ బోధనలు ఉంటాయి.
 
 సాక్షి: ఎంఈసీలో మౌలిక వసతులు ఎలా ఉంటాయి?
 రాహుల్: ఎంఈసీది సమీకృత అనుసంధానిత వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడినుంచైనా ముఖాముఖిగా బోధనలు వినే, పారిశ్రామిక నిపుణులతో మాట్లాడే సదుపాయాలు ఉన్నాయి. పరిశోధనలు లక్ష్యంగా ఎనర్జీ, ఇన్‌ఫ్రా, మెటీరియల్ సైన్స్, డిఫెన్స్, కంప్యూటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాలకు సంబంధించి ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం.
 
 సాక్షి: ఎలాంటి బోధన వసతులు ఉంటాయి?
 రాహుల్: పరిశోధనల ప్రాతిపదికగా బోధనలు ఉంటాయి. అధ్యాపకులు వారి సమయంలో సగాన్ని పరిశోధనలకే కేటాయిస్తారు. వారిలో 40 శాతం మంది విదేశీ ప్రొఫెసర్లే. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి 1:10గా ఉంటుంది.
 
 సాక్షి: విద్యార్థులకు మీ సంస్థలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
 రాహుల్: ఇక్కడే చదివే విద్యార్థులకు విదేశాల్లో 6 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. దీనివల్ల అంతర్జాతీయ పనితీరుపై అవగాహన వస్తుంది. దీనికితోడు విద్యార్థి ఐదేళ్లపాటు ప్రతి ఏటా ఇంటర్న్‌షిప్ చేయాలి.
 
 హైదరాబాద్‌లో మహీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్
 ఫ్రాన్స్ వర్సిటీ ఎకోల్ సెంట్రల్‌తో భాగస్వామ్యం
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్ వంటి విద్యాసంస్థల సరసన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ చేరబోతోంది. ట్రాక్టర్లు, కార్లు, రవాణా వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన మహీంద్ర గ్రూప్ హైదరాబాద్‌లో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ) ఇంజనీరింగ్ కాలేజీని స్థాపిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన యూనివర్సిటీ ఎకోల్ సెంట్రల్ భాగస్వామ్యంతో బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర క్యాంపస్ (గతంలో సత్యం క్యాంపస్)లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల వ్యయంతో నెలకొల్పుతోంది. ఇప్పటికే భవన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి.
 
 ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల సమీకృత ఎంటెక్ కోర్సును అందించేందుకు జేఎన్‌టీయూహెచ్‌తో ఒప్పం దం చేసుకుంది. వచ్చే ఏడాదే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ-మెయిన్ ర్యాంకుల ఆధారంగా కాలేజీ సీట్లు భర్తీ చేయనున్నారు. తొలి ఏడాది 300 సీట్లు, రెండో ఏడాది 360 సీట్లు, మూడో ఏడాది 420 సీట్లు భర్తీచేయనున్నారు. తొలి ఏడాది సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్న తరుణంలో విద్యాసంస్థలకు పారిశ్రామిక అనుసంధానమనే ఆలోచనలతో మహీంద్ర గ్రూప్ ఎంఈసీని ఏర్పాటు చేస్తోంది.
 
 

>
మరిన్ని వార్తలు