టీడీపీ ఎమ్మెల్యేకు షాక్‌.. మైనింగ్‌ క్వారీలు సీజ్‌

23 Feb, 2018 19:40 IST|Sakshi

సాక్షి, చీరాల : టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు మైనింగ్‌ అధికారులు షాక్‌ ఇచ్చారు. పలు మైనింగ్‌, ఇసుక క్వారీలను సీజ్ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, అధికార టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారంటూ పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా  పలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలో ఉండటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేశారు.

కానీ ఇటీవల అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమంచి వర్గీయులు చేస్తున్న అక్రమాలు రోజురోజుకు పెరిగిపోయాయి. అంతేకాదు అదే పార్టీకి చెందిన పలువురు నేతలను సైతం బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు నేతలు సైతం ఆమంచి క్వారీయింగ్‌పై పలు ఆరోపణలు చేసారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమ మైనింగ్‌పై దృష్టిపెట్టారు. చినగంజాం మండలంలోని కడవకుదురులోని రెండు క్వారీలతో పాటు వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లిలో ఉన్న 4 క్వారీలను సీజ్ చేశారు. ఈదాడుల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయటపడినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు