19 ఎంపీ సీట్లతో వైఎస్సార్‌సీపీ స్వీప్‌!

25 Jan, 2019 02:10 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ సారథ్యంలో పార్టీ విజయభేరి ఖాయం

పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక  స్థానాల్లో గెలుస్తుందన్న సర్వే

ఓట్ల పరంగా చూసినా 8.2 %  తేడాతో ‘ఫ్యాన్‌’ ప్రభంజనం

అధికార టీడీపీ ఏపీలో 6 ఎంపీ సీట్లకే పరిమితం

బీజేపీ, కాంగ్రెస్‌లకుఒక్క స్థానం కూడా దక్కదు

‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ తాజా సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీట్లలో నెగ్గి ఘన విజయం సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని అధికార టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ గురువారం విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ వైఎస్సార్‌ సీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది.  

ఓట్ల శాతంలోనూ వైఎస్సార్‌ సీపీ స్పష్టమైన ఆధిక్యం 
ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైఎస్సార్‌సీపీదే పైచేయిగా ఉంది. వైఎస్సార్‌ సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. బీజేపీకి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. సీ ఓటర్‌ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు