చీరాల రూరల్, న్యూస్లైన్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి.జనార్దన్ అన్నారు. మంగళవారం ఆయన చీరాల వచ్చిన సందర్భంగా స్థానిక ఏరియా వైద్యశాలలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన 2008 నుంచి 2013 ఆగస్టు చివరి వరకు జిల్లాలో 83,170 కేసులు నమోదు కాగా అందుకోసం రూ. 235.25 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
అలానే జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో మూడు ప్రభుత్వ వైద్యశాలలు, ఆరు ప్రైవేటు వైద్యశాలలు పని చేస్తున్నట్లు తెలిపారు. చీరాలలో ఆరోగ్యశ్రీ కింద రోగులను పరీక్షించేందుకు ప్రత్యేక సదుపాయాలున్న రెండు గదులను నిర్మించామన్నారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 938 రకాల కేసులు చూస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా నెట్వర్క్ టీం లీడర్ కిరణ్కుమార్, స్థానిక ఆరోగ్యమిత్ర మురళి ఉన్నారు.