‘ప్రజాసంకల్పయాత్ర టీడీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పింది’

6 Nov, 2019 17:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజా సంకల్ప యాత్ర ప్రధాన కారణమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర  రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన మదిలోని విషయాలు వెల్లడించారు. నవంబర్ 1 అనగానే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర గుర్తొస్తుందన్నారు.  ప్రజా సంకల్పయాత్ర.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలకు భరోసా ఇచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, తమను ప్రజలకు దగ్గర చేసిందన్నారు. వందల నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర ద్వారా ప్రజలు ఘనమైన మెజార్టీ ఇచ్చారని అదే సంకల్పయాత్ర గొప్పతనమని కొనియాడారు. నవరత్నాల ద్వారా పేద ప్రజలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని,  ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచారని  మల్లాది విష్ణు వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టి నాలుగు నెలలు గడవక ముందే ప్రతిపక్షాలు ఎంతో కాలంగా ఉన్న సమస్యలను కూడా ఈ నాలుగు నెలల్లో చేసినట్టు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించింది వారి సమస్యల పరిష్కారానికి మాత్రమే అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేసి అందరితో శభాష్ అనిపించుకునేలా ముఖ్యమంత్రి పాలన సాగిస్తారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు