లో దుస్తుల్లో బంగారు తీగలు

18 Feb, 2014 08:52 IST|Sakshi
లో దుస్తుల్లో బంగారు తీగలు

శంషాబాద్‌లో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాములు పట్టివేత
మరో వ్యక్తి నుంచి 465 గ్రాముల ఆభరణాలు స్వాధీనం


 శంషాబాద్, న్యూస్‌లైన్: దుబాయ్ నుంచి లో దుస్తుల్లో బంగారు తీగలు తెచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 467 గ్రాముల బంగారు తీగలు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడు అనుమతి లేకుండా తీసుకొచ్చిన 465గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన మహ్మద్ ఇక్బాల్(28) ఏఐ 952 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీలో పన్నెండు బ్రాలు కనిపించడంతో వాటిని నిశితంగా పరిశీలించారు.
 
 వాటిల్లో 24 తెలుపు రంగు తీగలను గుర్తించారు. ఇక్బాల్ బంగారు తీగలకు వెండి  పూత పూసి లో దుస్తుల్లో చొప్పించాడని గుర్తించారు. 467 గ్రాముల బరువున్న ఆ బంగారు తీగలను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే విమానంలో వచ్చిన షేక్ జలీల్ సుమారు 465 గ్రాముల బరువున్న ఆభరణాలను ధ రించాడు. వాటికి సంబంధించి అతడి వద్ద ఎలాంటి రశీదులు లేకపోవడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. రెండు ఘటనల్లో సుమారు రూ.28 లక్షలు విలువ చేసే 932 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు