అప్పు తీర్చమంటే.. స్క్రూడ్రైవర్‌తో పొడిచాడు

25 Jun, 2017 12:38 IST|Sakshi

విజయవాడ: నగరంలోని వన్ టౌన్ చిట్టినగర్‌లో దారుణం జరిగింది. గ్రంది వెంకట రంగారావు అనే వ్యక్తిని సెల్‌ఫోన్ మెకానిక్ గా పనిచేస్తున్న తాజ్ అనే యువకుడు స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు. పోలీసులు తాజ్‌ను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఛాతి భాగంలో స్ర్కూ డ్రైవర్ బలంగా దిగడంతో వెంటనే అతడిని అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలివి.. రంగారావు తన సెల్‌ఫోన్‌ను రిపేర్‌ చేయమని తాజ్‌కు ఇచ్చాడు. దాన్ని విక్రయించాలంటూ తాజ్ సలహా ఇవ్వగా అందుకు అతను అంగీకరించాడు.

రూ.5వేలకు సెల్‌ఫోన్‌ను విక్రయించిన తాజ్‌ ఆ డబ్బులు రంగారావుకు ఇవ్వలేదు. గతంలో రంగారావు వద్ద అప్పుగా తీసుకున్న రూ.4 వేలతో కలిపి మొత్తంగా రూ.9 వేలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి చిట్టినగర్ ఈద్గా సెంటర్‌లో తాజ్‌ను పట్టుకున్న రంగారావు తనకు రావాల్సిన రూ.9వేల గురించి నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా కోపం పట్టలేక తాజ్ స్ర్కూ డ్రైవర్‌తో రంగారావును పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు తాజ్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు