ఏటీఎం నుంచి వస్తుండగా కత్తితో దాడి

5 May, 2015 19:44 IST|Sakshi

బాలానగర్ (హైదరాబాద్) : గుర్తు తెలియని దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ మండలం గురుజాలకు చెందిన మరీదు వెంకటనర్సింహారావు(29) అనే వ్యక్తి బాలానగర్‌లో నివాసం ఉంటూ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు. సోమవారం రాత్రి తన ఇంటి సమీపంలోని ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేసుకొని తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడవబోయాడు. అప్రమత్తమైన నర్సింహారావు చేతిని అడ్డుగా పెట్టడంతో కత్తి చేతికి బలంగా గుచ్చుకుంది. అతడు కేకలు వేయటంతో ఆగంతకుడు పారిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తమకు ఎవరితోనూ విభేదాలు లేవని అతని భార్య విజయలక్ష్మి వెల్లడించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు