భార్య కాపురానికి రావటం లేదని...

19 Sep, 2014 16:23 IST|Sakshi

భార్య కాపురానికి రావడంలేదని వాటర్ ట్యాంకు ఎక్కి అధికారులను, గ్రామస్తులను కంగారుపెట్టాడో వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరుకు చెందిన యర్రంశెట్టి మాచిరాజు(30) వ్యవసాయ కూలీ. అతనికి 2012లో ఆచంటకు చెందిన దుర్గాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది కొడుకు ఉన్నాడు. మాచిరాజు మద్యానికి బానిస కావడంతో దుర్గాదేవి కొన్నాళ్ల కిత్రం పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యం మానితేనే కాపురానికి వస్తానని ఆమె చెప్పింది.
 
భార్య వదిలి వెళ్లిపోయిందని అందరూ ఏడిపించడంతో మనస్తాపం చెందిన మాచిరాజు పంచాయతీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంకు ఎక్కాడు. అక్కడ నుంచి దూకేస్తానంటూ అందరినీ కంగారు పెట్టించాడు. ఎస్సై విశ్వం వెంటనే ఘటనా స్థలానికి సిబ్బందితో వెళ్లారు.తన భార్యను కాపురానికి తీసుకువస్తేనే కిందికి వస్తానని, లేకపోతే దూకేస్తానని అతను ఎస్సైతో చెప్పాడు. చివరకు ఎస్సై పైకి వెళ్లి మాచిరాజును కిందికి దిచడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు