పొట్టకూటికెళ్లి పై లోకాలకు

17 May, 2019 13:35 IST|Sakshi
చిన్నారావు మృతదేహం రోదిస్తున్నన్న భార్య పైడితల్లి, కుమారుడు

విద్యుదాఘాతంతో ఒకరి మృతి 

జామి: పొట్టకూటి కోసం పట్నానికి కూలి పనికి వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గొడికొమ్ము గ్రామానికి చెందిన శీర చిన్నారావు (33) నిత్యం కూలి పనుల కోసం విశాఖపట్నం వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం కూడా పని కోసం విశాఖపట్నంలోని గోపాలపట్నం వెళ్లాడు. విధుల్లో భాగంగా విద్యుత్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా.. విద్యుదాఘాతంతో స్తంభం మీదే కన్నుమూశాడు. వెంటనే సహచరులు స్పందించి మృతదేహాన్ని కిందకు దించి సమీపంలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం సంఘటనా ప్రాంతానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన గొడికొమ్ముకు  తరలించారు. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య పైడితల్లి, కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు