ఒకే ఫ్లాట్‌ ఇద్దరికి రిజిస్ట్రేషన్; నిందితుడి అరెస్టు

24 Dec, 2013 20:57 IST|Sakshi

హైదరాబాద్: ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి మోసగించిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వై.శ్రీనివాస్ కుమార్ తెలిపిన ప్రకారం, నాచారం రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్ మజీద్(38), నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ సిరాజుద్దీన్(45) ఇద్దరు స్నేహితులు, రాఘవేంద్రనగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఫ్లాట్‌ను ముందుగా తన స్నేహితుడైన మహ్మద్ సిరాజుద్దీన్‌కు రిజిస్ట్రేషన్ చేశాడు.

అతను పూర్తిగా డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ అదే ఫ్లాట్‌ను వేరొకరికి అమ్మి రిజిస్ట్రేషన్ చేశాడు. మొదట రిజిస్ట్రేన్ చేసిన వ్యక్తి మహ్మద్ సిరాజుద్దీన్ ఆ ఫ్లాట్ పేపర్లు, చెరువులో ఉన్న నాలుగు ఓపెన్ ఫ్లాట్స్ పేపర్లు పెట్టి 2012లో బర్కత్‌పురలోని రాజధాని కో ఆపరేటివ్ భ్యాంకులో లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్‌లో కొంత చెల్లించగా, ఇంకా రూ.28 లక్షల వరకు పెండింగులో ఉంది. ఎంతకూ తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో అతను బ్యాంకులో కుదువపెట్టిన ఫ్లాట్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా, నాలుగు ఓపెన్ ఫ్లాట్స్ చెరువులో ఉన్నట్లు, రాఘవేంద్రనగర్‌లోని ఫ్లాట్ వేరేవారికి రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది.

దీంతో కంగుతున్న బ్యాంకు అధికారులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిలో సయ్యద్ అబ్దుల్ మజీద్‌ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్ సిరాజుద్దీన్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు