భార్యను కడతేర్చిన భర్త

2 Aug, 2019 10:19 IST|Sakshi
అనురాధ మృతదేహం 

సాక్షి, గుంటూరు : ప్రమాదవశాత్తు కాళ్లూ చేతులు విరిగి మంచానపడ్డ భర్తకు ఎన్నో సపర్యలు చేసి తిరిగి మామూలు మనిషిగా మార్చిన భార్యను భర్తే హతమార్చిన ఘటన  కలకలం రేపింది. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం సూర్యనగర్‌ కాలనీలో గురువారం సాయంత్ర ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నవ ఎస్సీ కాలనీకు చెందిన కాకర్లమూడి నాగేశ్వరరావుకు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన అనురాధ (23)తో 9 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. రాడ్‌బెండింగ్‌ పనులు నిర్వహించుకుని కుటుంబాన్ని పోషించుకునే నాగేశ్వరరావుకు కొంతకాలంగా మతిస్థిమితం ఉండటం లేదు. మొదట రాడ్‌బెండింగ్‌ పనుల్లో సంపాదించిన డబ్బులతో ఆటోను కొనుగోలు చేసి డ్రైవర్‌గా తిరిగాడు. ఫైనాన్స్‌లో తెచ్చిన ఆటోకు వాయిదాలు సక్రమంగా చెల్లించనందున ఫైనాన్స్‌ వారు దాన్ని తీసుకెళ్లారు.

మళ్లీ ఫైనాన్స్‌తో మరోఆటోను తీసుకున్నాడు. అయితే దాని పరిస్థితి కూడా అదేవిధంగా మారడంతో తిరిగి రాడ్‌బెండింగ్‌ పనుల్లోకి వెళ్లడం మొదలెట్టాడు. పనులకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండటంతో ఫైనాన్స్‌లోనే బైక్‌ను కొనుగోలు చేశాడు. ఆదాయం అంతమాత్రంగానే ఉండటంతో కిస్తీలు చెల్లించక బైక్‌ ఫైనాన్స్‌ ఆఫీసుకే చేరింది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చి 2018లో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తిసాగు చేపట్టాడు. అందులోనూ నష్టాన్నే చవిచూశాడు. ఇలా జీవితంలో అప్పులు, నష్టాలనే కూడగట్టుకున్న నాగేశ్వరరావు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఆలోచనలు ఎక్కువై మతిస్థిమితం లేకుండా పోయింది. వింతగా ప్రవర్తించడంతో బంధువులు చేతబడి చేశారని భావించి భూతవైద్యుడిని పిలిపించి రూ.25వేల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. డాబాపై నుంచి ఒక్కసారిగా దూకేశాడు. కాళ్లు చేతులు తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. భార్య అనురాధ భర్త మామూలు మనిషి అయ్యేంత వరకు సేవలు చేసింది. 

హత్య జరిగిందిలా...
గత 3, 4 రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పిల్లల్ని సైతం చంపేస్తానంటూ బెదిరించడంతో అనురాధ ఇద్దరు పిల్లల్ని బుధవారం తన పుట్టింటికి పంపించింది. గురువారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ కలిసి భోజనం చేసి మామూలుగానే ఉన్నారు. అయితే సాయంత్రం 3.30 గంటల మధ్యలో ఇంట్లో ఉన్న భార్యను మంచంపై పడేసి గుండెలపై కూర్చొని నోట్లో గుడ్డల్ని కుక్కి గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఇంటి బయటకు వచ్చి నా భార్యను చంపేశానంటూ చెప్పడంతో అవాక్కైన స్థానికులు పరుగున వెళ్లి ఇంట్లో చూడగా అప్పటికే అనురాధ విగత జీవిగా పడిఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిలకలూరిపేట రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై జె.శ్రీనివాస్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు