భార్య, మామను కారుతో ఢీ కొట్టాడు

1 May, 2019 19:09 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, మామను కారుతో ఢీ కొట్టి చంపబోయాడు. అయితే అదృష్టవశాత్తు వారిద్దరు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ గాయాలు కావడంతో వారిద్దరిని దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. జరుగుమల్లి మండలం బిట్రగుంటకు చెందిన శివాజీ, లత దంపతులు మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరగుతున్నాయి. దీంతో వారిద్దరు విడివిడిగా ఉంటున్నారు. విడివిడిగా ఉంటున్న శివాజీ, లతల మధ్య ఆస్తి తగాదా కొనసాగుతుంది. దీంతో లతపై శివాజీ కోపం పెంచుకున్నారు. 

లత, శివాజీల మధ్య ఆస్తులు సెటిల్‌మెంట్‌ కోసం కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కొండపి ఎమ్మెల్యే బాల ఆంజనేయులు వద్ద పంచాయతీ జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో వారు వెనుదిరిగారు. ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో శివాజీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. లతతో పాటు, ఆమె బాబాయిని కారుతో ఢీ కొట్టాడు. అయితే ఇందుకోసం శివాజీ ముందే పథకం రచించనట్టుగా తెలుస్తోంది. కాగా, లత తమ్ముడు గతంలో తనపై హత్యాయత్నం చేసినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ చర్యకు పాల్పడినట్టు శివాజీ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు