‘నీ పీడ వదిలించుకోవడానికే నాపై పోటీకి పంపారు’

22 Mar, 2019 14:32 IST|Sakshi

మంగళగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన ఆర్కే

సాక్షి, మంగళగిరి: ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఓట్లను అడుగుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్కే శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, తనకు స్వచ్చందంగా ప్రజల మద్దతు లభిస్తోందని తెలిపారు.

మంగళగిరిలో తనకు సరైన పోటీ నారాలోకేష్‌ కానేకాదని, వాళ్ల తండ్రి చంద్రబాబు నాయుడని ఆర్కే పేర్కొన్నారు. లోకేష్‌ పీడ వదిలించుకోవడానికే వాళ్ల నాన్న తనపై పోటీకి పంపారని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు పీజ్జా బర్గర్‌లు తినడం తప్ప.. కాడి తెలుసా, మేడి తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రజలకు ఏం చేసిందో వివరించి ఆ తరువాత ఓట్లు అడగాలని ఆర్కే స్పష్టం చేశారు. ఆయన నామినేషన్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైయారు.

మరిన్ని వార్తలు