తిరుమలలో రాజపక్స

10 Dec, 2014 03:43 IST|Sakshi
తిరుమలలో రాజపక్స

అడుగడుగునా గట్టి బందోబస్తు
తమిళ పార్టీల కార్యకర్తల నిరసన
ఎక్కడికక్కడ నిలువరించిన పోలీసులు
సుప్రభాత సేవలో శ్రీలంక అధ్యక్షుడు
సుప్రభాతం బుకింగ్, అంగ ప్రదక్షిణం రద్దు

 
 సాక్షి, తిరుమల: శ్రీ లంక అధ్యక్షుడు మహీంద రాజపక్స మంగళవారం తిరుమలకు వచ్చారు. తన కుమారుల్లో ఇద్దరు హోహితా రాజపక్స, రోహితా రాజపక్సతో కలసి సాయంత్రం 5.35 గంటలకు ఆయన తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ స్వాగతం పలికారు. అనంతరం రాజపక్స పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తిరుమల పద్మావతి అతిథిగృహంలో రాజపక్స కుటుంబ సభ్యులు బస చేశారు.
 
  బుధవారం వేకువజామున 2.30 గంటలకు సుప్రభాత సేవలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సమయంలో భద్రతా కారణాల రీత్యా టీటీడీ అంగ ప్రదక్షిణం రద్దు చేసింది. తిరుమలలోని విజయబ్యాంకులో కరెంట్ బుకింగ్‌లో ఇచ్చే సుప్రభాత సేవా టికెట్లను కూడా రద్దు చేశారు. ఈ టికెట్లను రాజ్యాంగ పరిధిలోకి వచ్చేవారికి మాత్రమే కేటాయించారు. త్వరలో శ్రీ లంకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకునేందుకు రాజపక్స వచ్చారని అధికారులు తెలిపారు.
 
 మిన్నంటిన నిరసనలు: రాజపక్స పర్యటన తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమిళనాడు నుంచి 500 మంది ఎండీఎంకే, వీసీకే పార్టీల కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బందోబస్తుతో రెండ్రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 

మరిన్ని వార్తలు