మావోయిస్టు శబరి దళ సభ్యుడి లొంగుబాటు

19 Mar, 2016 14:02 IST|Sakshi

కాకినాడ : మావోయిస్టు శబరి దళం ఏరియా కమిటీ సభ్యుడు మడివి దేవయ్య (24) అలియాస్ వినోద్ అలియూస్ దేవా లొంగిపోయినట్టు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఎటపాక మండలం విస్సాపురం గ్రామానికి చెందిన దేవయ్య గొత్తికోయ సామాజికవర్గానికి చెందిన గిరిజనుడు. మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితుడై 2008లో శబరి దళంలో చేరాడు. 2009లో మంగీదళం(ఆదిలాబాద్) సభ్యుడిగా పనిచేశాడు.

2010లో చర్ల దళానికి బదిలీ అయి కొద్దికాలం అనంతరం తిరిగి 2012లో శబరి దళంలోకి వచ్చి ఏరియా కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.  చింతూరు, ఎటపాక పోలీస్‌స్టేషన్లలో అతడిపై ఏడు కేసులు నమోదయ్యూయి. ఐదు హత్యల ఘటనల్లో పాత్ర ఉండడమే కాక మొబైల్ టవర్ కాల్చివేయడం, చెట్లు నరికి రోడ్డుపై పడవేయడం, సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడి వంటి ఘటనల్లో పాల్గొన్నాడు. లొంగిపోయిన దేవయ్యకు ప్రభుత్వపరంగా ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

 

మరిన్ని వార్తలు