మావోల లేఖ: వారు ఆదివాసీలు కాదు.. ద్రోహులు!

2 Nov, 2018 18:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ అధికార ప్రతినిధి జగబందు పేరుతో మావోలు లేఖలు విడుదల చేశారు. రాజకీయ నేతలకు, దళారీలను ఆ లేఖలో గట్టిగా హెచ్చరించారు. 

బాక్సైట్‌ పేరుతో మంత్రి పబ్బం గడుపుకుంటున్నారు
‘మైనింగ్‌ మాఫియాగా మారి, ఆదివాసీల ప్రాకృతిక సంపదను అప్పన్నంగా కొల్లగొడుతున్నందుకే అరకు ఎమ్మెల్మే కిడారి సర్వేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను హతమార్చాం. కిడారి, సోమాలు ఆదివాసీలు కాదు.. ద్రోహులు, సామ్రాజ్యవాద బహుళ జాతీ కంపెనీలకు దళారులు. కిడారి రోజుకో పార్టీ మారుతూ సంపాదనే ధ్యేయంగా బరితెగించారు. నాతవరం మండలంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ ఖనిజాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు, కొడుకు విజయ్‌లు వాటాలతో పబ్బం గడుపుకుంటున్నారు. మన్య ప్రాంత సంపద అక్రమ తరలింపు ఆపకపోతే జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’అంటూ మావోలు లేఖలో పేర్కొన్నారు. ఇక గత కొద్ది నెలలుగా ఆంధ్రా-ఒడిశా బార్డర్ (ఏవోబీ) వద్ద మావోయిస్టులు కదలికలు ఏపీ పోలీసులకు చాలెంజ్‌గా మారింది.   
 

మరిన్ని వార్తలు