ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్‌ 7.91 లక్షల టన్నులు

9 May, 2020 04:44 IST|Sakshi

ఇందులో 6.58 లక్షల పండ్లు, కూరగాయల కిట్లు ప్రజలకు పంపిణీ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సమయంలోనూ 7.91 లక్షల టన్నుల ఉద్యాన పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పించినట్టు ఉద్యాన శాఖ ప్రకటించింది. మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి శుక్రవారం వరకు 7,91,792 టన్నుల పండ్లు, కూరగాయలు, పూలు, ప్లాంటేషన్‌ పంటలను సేకరించి మార్కెటింగ్‌ చేసింది. ఇందులో సుమారు 6.58 లక్షల పండ్లు, కూరగాయల కిట్లను ప్రజల వద్దకు చేర్చింది. మార్చి నుంచి జూలై వరకు పరిగణించే సీజన్‌లో ఉద్యాన పంటల మొత్తం దిగుబడి అంచనా 45,87,833 టన్నులు కాగా ఇందులో ఇప్పటివరకు 14,71,935 టన్నులను ప్రభుత్వం మార్కెటింగ్‌ చేసింది. ఈ మొత్తంలో లాక్‌డౌన్‌ సమయంలోనే 7.91 లక్షల టన్నుల్ని మార్కెటింగ్‌ చేయడం గమనార్హం. మార్కెటింగ్, ఉద్యాన శాఖల అనుసంధానంతోనే ఇది సాధించగలిగామని అధికారులు చెబుతున్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ చర్యలివీ.. 
లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం పలు చర్యలను చేపట్టడం వల్లే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సాధ్యపడిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య తెలిపారు.  
► వివిధ శాఖల మధ్య అనుసంధానం, రవాణాకు పర్మిట్లు, అంత ర్రాష్ట్ర మార్కెటింగ్‌కు ఏర్పాట్లు 
► రూ.55, రూ.100, రూ.150 విలువైన పండ్లు, కూరగాయలు, పూల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు 
► రూ.250 మామిడి కాయల కిట్లు (ఏ జిల్లాలో ఏ పండు ఉంటే ఆ పండ్లతో కిట్ల తయారీ) 
► తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పూల రైతుల సమస్య పరిష్కారం. మార్కెటింగ్‌ శాఖే కొనేలా చర్యలు 
► తూర్పుగోదావరిలో సాగయ్యే కర్రపెండలం, కంద కనీస మద్దతు ధరకు కొనుగోలు 
► చిత్తూరు జిల్లాలో క్యారెట్‌ను కిలో రూ.13కు కొనేలా ఏర్పాటు 
► రాష్ట్రవ్యాప్తంగా అరటి, బత్తాయి సేకరణకు ఏర్పాట్లు 
► శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడిమామిడి ఎగుమతి, దిగుమతులకు సంబంధించి తలెత్తిన హమాలీల సమస్య పరిష్కారం 
► వివిధ జిల్లాల్లో పండ్లు, కూరగా యల సేకరణకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎగుమతిదారులతో ఆయా జిల్లా కలె క్టర్లు సమావేశాలు నిర్వహించి పరి స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం 
► మొబైల్‌ వ్యాన్లు, రైతు బజార్లతో సరకును ప్రజల ముంగిటకు చేర్చడం 

>
మరిన్ని వార్తలు