ప్రేమ వివాహం విషాదాంతం

8 Aug, 2017 04:45 IST|Sakshi
ప్రేమ వివాహం విషాదాంతం

వివాహిత అనుమానాస్పద మృతి
భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి తల్లి


పీఎం పాలెం (భీమిలి) : ప్రేమ వివాహం చేసుకున్న ఆరు నెలలకే ఓ యువతి తనువు చాలించింది. యువతి ఇంట్లో ఉరి వేసుకుని వేలాడుతుండగా పోలీసుల సమక్షంలో వారి బంధువులు కిందకు దించారు. సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ కె.లక్ష్మణమూర్తి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... మద్దిలపాలెం పెట్రోలు బంకు వెనుక నివసిస్తున్న పైబూడి వెంకటేశ్వరరావు కుమార్తె సంతు దుర్గాదేవి(24) గరంలోని ఓ ప్రముఖ వ్యాపార సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నరేష్‌కుమార్‌ రెడ్డి అనే యువకుడితో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెద్దలకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.

అనంతరం కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మధురవాడ స్వతంత్రనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరి ప్రేమ వివాహం విషయం యాజమాన్యానికి తెలియడంతో ఇద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీంతో కన్నవారి ఇంటి నుంచి డబ్బులు తీసుకురమ్మని భార్యపై నరేష్‌ ఒత్తిడి చేస్తుండేవాడు. తమ కష్టాలు తల్లి సత్యవతికి దుర్గాదేవి తెలియజేయడంతో ఆమె పలుమార్లు కొంత నగదు పంపించింది. ఈ క్రమంలో కన్నవారి ఇంటి నుంచి రూ.2లక్షలు తీసుకురమ్మని భార్యపై నరేష్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె మృతదేహం ఇంటిలో వేలాడుతూ కనిపించింది.

 విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునే సమయానికి ఆమె భర్త నరేష్‌కుమార్‌రెడ్డి ఆచూకీ లభించలేదు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తాను అనుభవిస్తున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలను నోట్‌బుక్‌లో నాలుగు పేజీలలో దుర్గాదేవి రాసింది. ఆ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి సత్యవతి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు