ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

17 Oct, 2018 11:05 IST|Sakshi

ఉద్యోగం పేరుతో యువతిని లొంగదీసుకున్న ఉపాధ్యాయుడు

భార్య అలిగి వెళ్లడంతో ఇంటికే తీసుకొచ్చి సహజీవనం

సహకరించిన మరో టీచర్‌ 

ప్రియుడితో ఘర్షణ పడి ప్రియురాలు ఆత్మహత్య

కార్వేటినగరం: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడుతో గొడవ పడి ఆ యువతి తనువు చాలించింది. ఎస్‌ఐ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలు.. కార్వేటినగరం మండలం పరిధిలోని గుండ్రాజు ఇండ్లు( పెళ్లిచింతమాను) గ్రామానికి చెందిన  కె.గురుమూర్తి(30) రామకుప్పం మండలం గురుకుల మడుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ గ్రామంలో ఉంటోన్న కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె పి. శ్రావణి(21)ని గురుమూర్తి ఉద్యోగం ఇప్పిస్తానని వశపరుకున్నాడు. తిరుపతిలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో కూడా చేర్పించాడు. ఈ క్రమంలో శ్రావణి తమ సొంత గ్రామం గురుకుల మడుగుకు ఇటీవల వెళ్లి పోయింది. దీంతో రామకుప్పం మండలంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు ప్రేమ్‌కుమార్‌ ద్వారా శ్రావణిని కార్వేటినగరానికి గురుమూర్తి రప్పించాడు.

భార్య పుట్టింటికి అలిగిపోవడంతో..
కాగా గురుమూర్తి ఆరేళ్ల క్రితం పాదిరికుప్పం గ్రామానికి చెందిన కావేరిని  ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా గురుమూర్తి  శ్రావణితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి సక్రమంగా రాకపోవడంతో భార్య కావేరి మూడు నెలల క్రితం భర్తతో గొడపడి పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. దీంతో శ్రావణిని శనివారం కార్వేటినగరంలో.. సరాసరి తన మొదటి భార్యతో కాపురం ఉంటున్న అద్దె ఇంటిలోకే  తీసుకొచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి, ఉద్యోగానికి సంబంధించి సోమవారం రాత్రి గొడవ జరిగింది. తనకు ఉద్యోగమైనా ఇప్పించాలని లేకుంటే పెళ్లి చేసుకోవాలని శ్రావణి నిలదీసింది. అందుకు గురుమూర్తి నిరాకరిండంతో శ్రావణి తీవ్ర మనస్థాపానికి గురైంది.

 తర్వాత వంటగదిలోకి వెళ్లి ఫ్యాన్‌ కొక్కీకి ఉరేసుకుని మృతి చెందింది. కాగా సోదరుడైన మరో ఉపాధ్యాయుడు ప్రేమకుమార్‌ కూడా ఈ వ్యవహారంలో గురుమూర్తికి సహాయం చేసినట్లు తెలిసింది. అలాగే శ్రావణిని ప్రేమకుమారే స్వగ్రామం నుంచి కార్వేటినగరానికి తీసుకొచ్చాడని సమాచారం. కాగా మృతురాలు శ్రావణి కుటుంబం కడు పేదరికంలో ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని గురుమూర్తి లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు