అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

12 Aug, 2019 07:26 IST|Sakshi
మృతిచెందిన గోమతి

సాక్షి, పుత్తూరు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన పుత్తూరులో జరిగింది. బంధువుల కథనం మేరకు.. పుత్తూరు ఆరేటమ్మ కాలనీకి చెందిన హరిప్రియకు కుమార్తె గోమతి (24) నాలుగేళ్ల కిత్రం నగరి పట్టణం రామ్‌నగర్‌ కాలనీకి చెందిన జ్ఞానశేఖర్‌ కుమారుడు చిరంజీవిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. చిరంజీవి పుత్తూరు మెయిన్‌ రోడ్డులో బాలాజీ కంప్యూటర్స్‌ దుకాణం నడుపుతున్నాడు. గోమతికి భర్త, అత్తమామల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో గోమతి రెండు నెలల క్రితం కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ విషయాలు చర్చించేందుకు కంప్యూటర్‌ దుకాణానికి రావాలని భర్త చిరంజీవి ఫోన్‌ ద్వారా భార్యను కోరాడు. భర్త వద్దకు వెళ్లిన గోమతి దుకాణంలో ఉరి వేసుకుంది. ¿భర్త చిరంజీవి గమనించి ఆమెను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 

నా కూతురిని భర్తే పొట్టనపెట్టుకున్నాడు
తన కూమార్తెను భర్త చిరంజీవి పొట్టన పెట్టుకున్నాడని తల్లి హరిప్రియ కన్నీటిపర్యంతమైంది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ విషయాలు చర్చిద్దామని గోమతిని ఒంటరిగా పిలిపించుకున్నాడని వాపోయింది. దుకాణంలో హత్య చేశాడని ఆరోపించింది. వరకట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసించారని చెప్పింది. ఈ మేరకు పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు