ఏలూరులో భారీ చోరీ

21 Jun, 2015 04:18 IST|Sakshi

ఏలూరు అర్బన్ :   ఏలూరు నగరంలో చోరులు హల్‌చల్ చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను ల క్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో స్థానిక కొత్తపేటలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. టూటౌన్ సీఐ ఉడతా బంగారురాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 41వ డివిజన్ కొత్తపేటలో నివాసం ఉండే బొమ్మి వెంకటేశ్వరరావు పూల వ్యాపారం చేస్తుంటాడు.  ఈ నెల 15న ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో దైవదర్శనం కోసం తిరుమల తిరుపతి వెళ్లారు.
 
 దైవదర్శనం అనంతరం తిరిగి శనివారం ఉదయం 5.30 ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నాడు.  ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన వెంకటేశ్వరరావు బీరువాలో దాచుకున్న 20 కాసుల బంగారం, 70 తులాల వెండి  అపహరించుకుపోయారని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ యు.బంగారు రాజు, ఎస్సై జి.ఫణీంద్ర ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించారు. ఎస్సై ఫణీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు