ఇక శుద్ధ జలధార

2 Sep, 2019 10:26 IST|Sakshi
వాటర్‌ గ్రిడ్‌కు వినియోగించనున్న వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు

ఇంటింటికీ మినరల్‌ వాటర్‌ అందించేందుకు చర్యలు

ఒక్కో వ్యక్తికి వందలీటర్ల వంతున సరఫరా

రెండో దశలోనే జిల్లాకు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు

రూ. 2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసిన  అధికారులు

అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే... శుద్ధమైన నీటిని సేవించాలి. సంక్షేమ పథకాలతోనే సంతృప్తి చెందని సర్కారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ... వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో ప్రజలకు దశలవారీగా శుభ్రమైన నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతలో జిల్లాలో అమలు చేయనున్న పథకం కోసం జిల్లా అధికారులు రూ. 2600 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. నేడో రేపో దానిని మంత్రులకు అందించి ఆమోదింపజేయనున్నారు. 

జిల్లాలోని తాగునీటి పథకాల సంఖ్య: 1989
ఇందులో సోలార్‌ పథకాలు    :         160
మల్టీ విలేజ్‌ స్కీంలు    :                    34

సాక్షి, బొబ్బిలి: ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని ఇంటింటికీ అందించేందుకు నిర్ణయించింది. రెండో దశలో ఈ పథకం మన జిల్లాలో అమలు పరచనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని వర్తింపజేసి తాగునీటి సమస్యను నూరు శాతం పరిష్కరించే చర్యలు తీసుకోనున్నారు. జిల్లాకు పూర్తి స్థాయి వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును అమలు పరిచేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో దీనికి జలధార అనే నామకరణం చేశారు. జిల్లాలోని 34 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మండలాల్లో ఉన్న పథకాలను కూడా వినియోగిస్తారు. ఆయా పథకాలకు శుద్ధి చేసిన జలాన్ని సరఫరా చేసి ఆ నీటిని గ్రామాల్లోని ప్రజలకు ఇంటింటికీ అందజేస్తారు. ఇందుకో సం అన్ని గ్రామాల్లో అదనపు పైప్‌లైన్లు నిర్మించనున్నారు.

రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌..
జిల్లాలో పథకం అమలుకు సంబంధించి గ్రామీ ణ నీటి సరఫరా విభాగం అధికారులు రూ. 2,600 కోట్లతో ప్రణాళికలు, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఈ నిధులతో వాటర్‌ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, ఓవర్‌హెడ్‌ట్యాంకులు, తాగునీటి పైప్‌లు నిర్మిస్తారు. తద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తారు. విజయవాడ తరహాలో సాగునీటి ప్రాజెక్టుల్లోని మిగులు జలా లు వృధాగా పోకుండా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే ప్రణాళికే వాటర్‌గ్రిడ్‌. ఈ జలాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల సహాయంతో శుద్ధ జలాలుగా మారుస్తారు. ఇందుకోసం జిల్లాలోని తోటపల్లి, తాటిపూడి రిజర్వాయర్ల నీటిని తాగునీటి అవసరాలకోసం మారుస్తారు. దీనివల్ల మిగులు జలాలు వృధాగా నదుల్లోకి విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే నిత్యం బోర్లతో భూగర్భ జలాలను తోడేస్తూండటంవల్ల తలెత్తే పర్యావరణ ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చనేది ముఖ్యమంత్రి భావన.

మనిషికి వందలీటర్ల నీరు పట్టణాల్లో ఓ వ్యక్తికి రోజుకు135 లీటర్ల నీరు అవసరం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 105 లీటర్ల నీరు అవసరమనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల్లో ఒకటి. వీటి ని అనుసరించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా సగటున ఓ వ్యక్తికి వంద లీటర్ల తాగునీరు ఇవ్వాలని జిల్లా అధి కారులు నిర్ణయించారు. తాగునీరు, వాడుక నీరు అన్న తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ వా టర్‌గ్రిడ్‌ను అమలు పరచాలని నిర్ణయించారు. దీనిపై సిద్ధం చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవా ణి, ఇన్‌ఛార్జి మంత్రులకు అధి కారులు అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు వెంటనే ప్రారంభిస్తారు. 

మనిషికి వంద లీటర్ల నీరు..
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రతీ ఇంటిలోని ఒక్కో వ్యక్తికీ వందలీటర్ల చొప్పున నీటిని అందిస్తాం. ఇందుకోసం రూ.2,600 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశాం. త్వరలో ప్రభుత్వ పెద్దలకు అందజేస్తాం. 
– పప్పు రవి, ఎస్‌ఈ ఇన్‌చార్జి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, విజయనగరం  

మరిన్ని వార్తలు