ఆందోళన బాటపట్టిన క్యాబ్‌ డ్రైవర్లు, ఓనర్లు

29 Jan, 2019 17:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, యజమానులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం రోడ్‌ ట్యాక్స్‌, ఇన్సూరెన్స్‌ పేరిట భారీగా వసూళ్లు చేపట్టడాన్ని నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్యాబ్‌ డ్రైవర్లు, యజమానులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమరావతి కోసం ఏడాదికి 2వేల రూపాయలు లెబర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. మ్యాక్సీ క్యాబ్‌లకు పోలీసులు పార్కింగ్‌ సదుపాయం కల్పించకపోగా, ఫొటోలు తీసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. 

లక్షల రూపాయలు ఖర్చు చేసి వాహనాలు నడుపుతున్నా.. ఆయిల్‌ డబ్బులు కూడా రావటం లేదని వాపోయారు. ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌లు కట్టలేక భార్యల పుస్తెలు తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాక్సీ క్యాబ్‌ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని అన్నారు. పలు ట్యాక్స్‌ల పేరిట, ఇన్సూరెన్స్‌ పేరిట ఏడాదికి సుమారు లక్ష రూపాయలు లాగేస్తుంటే.. తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు