వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు

1 May, 2019 12:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీయూసీ ఆధ్వర్యంలో మే డే వేడుకలు జరిపారు. పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బుధవారం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌, పలువురు నేతలు పాల్గొన్నారు.

విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు  జెండా ఎగురవేసి అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కార్మికులకు, కర్షకులకు న్యాయం జరగలేదన్నారు. చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించారని ఆరోపించారు.

కార్మికవర్గ ప్రభుత్వాన్ని ఈ నెల 23న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల మొహంలో చిరునవ్వులు చూడాలన్నది వైఎస్‌ జగన్‌ తాపత్రయం అని వైఎస్సార్‌ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమం గాలికొదిలేసిందని, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మల్లాది విష్ణు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు మెహబూబ్ షేక్, ఎంవీఆర్ చౌదరి, విశ్వనాథ్ రవి, ప్రదీప్ కుమార్, మాదు శివరామకృష్ణ, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు