రాజంపేట.. ఒకేబాట..

16 Feb, 2019 11:06 IST|Sakshi
ఆకేపాటి, మిథున్‌రెడ్డి, మేడాను గజమాలతో సత్కరిస్తున్న పార్టీ శ్రేణులు

రాజంపేట : వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి శుక్రవారం ఒక్కటయ్యారు. వీరి ఆత్మీయ సమావేశానికి మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హాజరయ్యారు. తొలుత మల్లికార్జునరెడ్డి తన అనుచరవర్గంతో ఆకేపాటి స్వగృహానికి చేరుకున్నారు.అక్కడ నేతలు భేటీ అయ్యారు. తర్వాత వారిని మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి కలుసుకున్నారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. దీంతో రాజంపేట వైఎస్సార్‌సీపీలో నూతనోత్సహం వెల్లివిరిసింది. ఆకేపాటి స్వగృహంలో పార్లమెంటరీ బీసీ విభాగం కన్వీనర్‌ పసుపులేటి సుధాకర్, పార్టీ నేతలు భాస్కరరాజు, పాపినేని విశ్వనాథ్‌రెడ్డి, గోవిందుబాలకృష్ణ, పోలిమురళీరెడ్డి,సుబ్బరాజు, దండుగోపి, మైనార్టీనేతలు ఖలీల్, యూసఫ్‌తోపాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మేడాను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి: మిథున్‌రెడ్డి
ఈ సందర్భంగా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సహకారంతో రాజంపేటలో మేడా మల్లికార్జునరెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధికమెజార్టీతో గెలిపించుకుంటామని వెల్లడించారు. జిల్లాలో పదికి పదిసీట్లు గెలవడం ఖాయమన్నారు. జననేతవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. జగన్‌ సీఎం కావడం వల్లనే ఈ రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయన్నారు.

ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆశయాలను కొనసాగించడానికి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి కృషిచేస్తానన్నారు. చంద్రబాబు జగన్‌ నవరత్నాలు కాపి కొడుతూ ఎన్నికల ముందు పథకాలను ప్రకటిస్తున్నారన్నారు. రాయలసీమకు అన్ని విధాలుగా టీడీపీ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే సీమకు వైఎస్సార్‌ హయాంలో నాటి స్వర్ణయుగం వస్తుందన్నారు.

కులరాజకీయాలకు పెట్టిందిపేరు టీడీపీ: మేడా
తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ కుల రాజకీయాలకు పెట్టింది పేరు టీడీపీ అని విమర్శించారు. దానిపీడ వదలించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు అమర్‌నాథ్‌రెడ్డి సహకారంతో పనిచేస్తామన్నారు. సమావేశంలో మేడా సోదరుడు మధురెడ్డి, మేడా చిన్నాయన మేడా భాస్కర్‌రెడ్డి, మహిళనేత ఏకులరాజేశ్వరి, మాజీ ఎంపీపీ లక్ష్మీనరసయ్య, ఏరియా ఆసుపత్రి కమిటి చైర్మన్‌ వడ్డెరమణ, వడ్డీ శ్రీను, మైనార్టీ నేతలు గుల్జార్‌బాష, ఖాజా, పార్టీ నేతలు కసిరెడ్డి అశోక్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, యానాదిరెడ్డి, పిచ్చిరెడ్డి,గంగిరెడ్డి,శివరామరాజు, మామిళ్లరవి, మధు,పోలి సుబ్బారెడ్డి, ప్లీడర్‌ కృష్ణకుమార్, ఒంటిమిట్ట నేత గడ్డం జనార్ధన్‌రెడ్డి, నందలూరు కో–ఆప్షన్‌సభ్యుడు మున్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేతలకు ఘనస్వాగతం..
ఆకేపాటి, మేడా, మిథున్‌రెడ్డి బైపాస్‌లోని వైజంక్షన్‌ సమీపంలోని మేడా స్వగృహం వద్దకు చేరుకున్నారు. వీరికి పార్టీలో చేరిన అనుచరులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. మేడా భవన్‌లో వీరునాయకులను, కార్యకర్తలను కలుసుకొని ఆపాయ్యంగా పలకరించారు. వైఎస్సార్‌సీపీ క్యాడర్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం నెలకొనింది. ఇటు మేడా, అటు ఆకేపాటి అనుచరులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కటయ్యారు. పరస్పరం పలుకరించుకున్నారు.

>
మరిన్ని వార్తలు